ఈ నెల 20న శిల్పకళావేదికలో ఆట కదరా శివ
ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి ‘ఆటగదరా శివ’ అనే పేరుతో ఒక పుస్తకాన్ని పాఠకలోకానికి అందించిన విషయం తెలిసిందే. ఈ పుస్తకం ప్రేక్షకాదరణకు నోచుకోవడమే కాకుండా విమర్శలకు ప్రశంసలు కూడా అందుకుంది. ఈ పుస్తకంలోని అంశాలను ఒక కార్యక్రమం రూపంలో కూర్చి దేశవిదేశాలలో ఎన్నో ప్రదర్శనలిచ్చారు. అమెరికా, దుబాయి వంటి పలు దేశాలలో భారతీయ వాయిద్యాలతో ఆటగదరా శివను కచేరి తరహాలో ప్రదర్శించారు.
ఈ ప్రదర్శనకు దక్కుతున్న ఆదరణను గమనించి, ఈ కార్యక్రమాన్ని మరోస్థాయికి తీసుకెళ్లే ఆలోచనతో ఒక అంతర్జాతీయ స్థాయి సంగీతంతో, కళాకారుల బృందంతో సింఫనీ తరహాలో ప్రదర్శించేందుకు ఇప్పుడు రంగం సిద్ధమైంది. ఫ్లూట్ నాగరాజు, డ్రంస్ శివమణి తదితర ప్రసిద్ధ కళాకారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. పలు విదేశీ పరికరాలను ఉపయోగించి ఈ కార్యక్రమాన్ని అజరామరంగా మార్చడానికి ప్రయత్నం జరుగుతోంది.
ఈ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ సాయంత్రం 6:30 గంట నుంచి హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరగనుంది. దీనికి డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణా టూరిజం వారు సహకారాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి భారతి సిమెంట్స్, అలేఖ్య హోమ్స్, కాంచీపురం వరమహాక్ష్మి సిల్క్స్, టివీ5 లాంటి పలు సంస్థలు వెన్నుదన్నుగా నిలుస్తూ తమ కళాభిరుచిని చాటుకుంటున్నాయి. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, తెంగాణ రాష్ట్ర మంత్రివర్యులు వి.శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. సినిమారంగానికి, ఇతర రంగాలకు చెందిన పలువురు లబ్ధప్రతిష్టులు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరుకానున్నారు. సీనియర్ నటులు సాయి కుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు. దీనికి హజరు కావానుకునే వారు ప్రవేశరుసుము చెల్లించాల్సి ఉంటుంది. టికెట్లు ముందుగా తీసుకోవానుకునేవారు బుక్ మై షో యాప్ ద్వారా బుక్ చేసుకునే సౌలభ్యం ఉంది.













