కొత్తగూడెం పారిశ్రామికవేత్తకు అరుదైన అవకాశం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక పాల్గొననున్న ప్రపంచ యువ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనే అరుదైన అవకాశం భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పట్టణానికి చెందిన సాయి సుబ్రమణ్యంకు దక్కింది. 23 ఏళ్ల ఈ యువకుడు ప్రాథమిక విద్యాభ్యాసం నుంచే చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. ఇంటర్మీడియట్లో ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించాడు. సుబ్రమణ్యం బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం సోరెవా అనే కంపెనీని స్థాపించి సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్వహణకు అధునాతన టెక్నాలజీతో పాటు విద్యుత్ అందుబాటులో లేని గ్రామాలకు స్వయం ప్రతిపత్తి కలిగిన విద్యుత్ ఉపయోగకర వ్యవస్థను అందుబాటులోకి ఉంచే విధానాన్ని రూపొందించారు. నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్టుకు విశ్వసనీయతపై క్రియాశీల పరిశోధనలు చేయడమే కాకుండా విద్యుత్ రంగంలో అత్యాధునిక సాంకేతికతను, నైపుణ్యాన్ని అందించేందుకు ఆయన చేస్తున్న కృషిని ప్రభుత్వం గుర్తించి ఈ సదస్సుకు ఆహ్వానించింది.
ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాల నుంచి 1500 మంది యవ పారిశ్రామికవేత్తలు సమావేశమయ్యే ఈ సదస్సుకు కొత్త కంపెనీలను స్థాపించి ప్రజలకు ఉపయోగపడేలా నిర్వహిస్తున్న యువ సీఈవోలను ఎంపిక చేసిన విషయం విదితమే. ఇందులో గూడెంకు చెందిన యువ పారిశ్రామికవేత్తలు సాయి సుబ్రమణ్యం పాల్గొననుండటంతో జిల్లాలో హర్షాతికేరాలు వ్యక్తమవుతున్నాయి.













