శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగ్మెంటేషన్ రియాలటీ టెక్నాలజీ సాఫ్ట్ వేర్
ఆలయాన్ని పరిశీలించిన తిరుపతి జెఈవో లక్ష్మీకాంతం
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో టిటిడి తిరుపతి జెఈవో బి.లక్ష్మీకాంతం సోమవారం ఉదయం అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఫ్రైడే గార్డెన్లో ఆలయ స్థలపురాణం, అమ్మవారి పుట్టుక, శ్రీపద్మావతి పరిణయం, శ్రీనివాసుడి కల్యాణం వరకు వరుస క్రమంలో ఛాయచిత్రాలతో కూడిన కథనాన్ని తెలుసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఆగ్మెంటేషన్ రియాలటీ టెక్నాలజీ సాఫ్ట్వేర్ను లింక్ చేస్తున్నామని, భక్తులు శ్రీ పద్మావతి అమ్మవారి యాప్ను డౌన్లోడ్ చేసుకుని, ఆయా ఛాయచిత్రాన్ని స్కాన్ చేస్తే ఛాయచిత్రంలోని దేవతలు, ఋషులు తమ వృత్తాంతాన్ని తెలియజేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
రెండో దశలో మండపం స్తంభాలలోని శిల్పాలను లింక్ చేయడం వల్ల శిల్పాలే మాట్లాడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తద్వారా భక్తులు ప్రత్యేక అనుభూతి పొందవచ్చని తెలిపారు. 3డి లేజర్ కమ్ ప్రొజెక్షన్ మ్యాపింగ్ ద్వారా పద్మపుష్కరిణిలో అమ్మవారి పురాణ మహిమలు, రూపాలు నీటిలో కనిపించేలా చర్యలు చేపట్టామన్నారు. మాస్టర్ప్లాన్లో భాగంగా తిరుచానూరులో దశలవారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఈఈ సత్యనారాయణ, ఏవిఎస్వో సురేంద్రబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.













