శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి పుష్పయాగం గోడపత్రికల ఆవిష్కరణ
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 31వ తేదీన జరుగనున్న వార్షిక పుష్పయాగం గోడపత్రికలను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఆలయంలో ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారని, ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని వివరించారు. మార్చి 30వ తేదీ శనివారం సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు అంకురార్పణ జరుగనుందన్నారు. మార్చి 31వ తేదీ ఆదివారం ఉదయం 9.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో స్నపన తిరుమంజనం నిర్వహిస్తారని తెలిపారు. మధ్యాహ్నం 2 నుండి 4.30 గంటల వరకు పుష్పయాగం కన్నులపండుగగా జరుగనుందని, ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారని తెలియజేశారు. భక్తులు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొనాలని జెఈవో కోరారు.
కాగా, రూ.516/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) పుష్పయాగంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు రవికె, ఉత్తరీయం బహుమానంగా అందజేస్తారు. పుష్పయాగం కారణంగా మార్చి 31వ తేదీన ఆర్జిత కల్యాణోత్సవం సేవను టిటిడి రద్దు చేసింది.
గోడపత్రికల ఆవిష్కరణ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కె.ధనంజయుడు, ఏఈవో శ్రీ డి.లక్ష్మయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ బి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
———-
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.













