ఒంగోలు కోర్టు సంచలన తీర్పు… 12 మందికి

హైవే కిల్లర్ మున్నా కేసులో ఒంగోలు ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వచ్చింది. మొత్తం 18 మంది నిందితుల్లో 12 మందికి ఉరిశిక్ష మరో ఏడుగురికి జీవిత ఖైదును విధిస్తూ తీర్పు ఇచ్చింది. అప్పటి కోల్కతా-చెన్నై 16వ నెంబర్ జాతీయ రహదారిపై కొన్ని లారీలు, సిబ్బంది, వాటిలో ఉన్న సరకు అదృశ్యం అయిన కేసుల్లో మున్నా హస్తం ఉన్నట్లు ఇటీవల నిర్ధరించిన కోర్టు 3 కేసుల్లో ఉరిశిక్ష ఖరారు చేసింది. ఈ మేరకు 8వ అదనపు కోర్టు న్యాయమూర్తి జి.మనోహర్ రెడ్డి తీర్పు ఇచ్చారు. జిల్లాలో 2008లో హైవే కిల్లర్ మున్నా కేసు సంచలనం రేకెత్తించింది. జాతీయ రహదారిపై లారీలు ఆపి 13 మంది డ్రైవర్లు, క్లీనర్లని హత్య చేసింది ఈ మున్నా గ్యాంగ్. ఐరన్ లోడ్తో వెళ్తున్న లారీలను టార్గెట్ చేసి డ్రైవర్, క్లీనర్లని చంపి లారీలు ఎత్తుకెళ్లేవారు. ఈ హత్య కేసుల్లో 18 మందిని నిందితులుగా కోర్టు నిర్ధారించింది.
2008లో ఈ ముఠా పాల్పడిన దారుణాలపై జిల్లాలోని ఒంగోలు తాలుకా, సింగరాయకొండ, మద్దిపాడు పోలీస్ స్టేషన్లలో ఏడు కేసులు నమోదు చేశారు. వీటిలో నాలుగు కేసుల్లో మున్నాతో పాటు 18 మందిపై నేరం రుజువైనట్లు న్యాయమూర్తి ఈ నెల 18న పేర్కొన్నారు. వీరంతా దారిడోపిడీలు, హత్యలకు పాల్పడటంతో పాటుగా అందుకు సంబంధించిన ఆధారాలను రూపుమాపినట్లు ఆయుధాలు కలిగి ఉన్నట్లు నిర్ధారించారు. ఈ కేసుపై ప్రకాశం జిల్లా 8వ అదనపు సెషన్స్ కోర్టులో వాదోపవాదనలు జరిగాయి. మొత్తం 7 కేసులకు గానూ 3 కేసుల్లో తీర్పు వెలువరించింది.