Nara Lokesh: మెగా డిఎస్సీ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి లోకేష్

కలసికట్టుగా ఎపి మోడల్ ఎడ్యుకేషన్ ను ప్రపంచానికి చాటుదాం
నవంబర్ లో మళ్లీ టెట్ నిర్వహిస్తాం… టీచర్ పోస్టులన్నీ భర్తీచేస్తాం
150రోజుల్లో 150 కేసులు వేసినా విజయవంతంగా డిఎస్సీ పూర్తిచేశాం
గురువుల మార్గదర్శనం వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నా
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నాయుడు గారు చెప్పిన విధంగా ఇకపై ప్రతిఏటా డిఎస్సీ నిర్వహిస్తాం, నవంబర్ లో టెట్ చేపడతాం, వచ్చేఏడాది మళ్లీ పారదర్శకంగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పేర్కొన్నారు. సచివాలయం సమీప ప్రాంగణంలో మెగా డిఎస్సీ విజేతలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… 150రోజుల్లో డిఎస్సీ నిర్వహించడం ఒక చరిత్ర, ఇది నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్. రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సులతో మాకు మూడుతరాలు డిఎస్సీ ప్రకటించే అవకాశం వచ్చింది. ఎన్టీఆర్, చంద్రబాబు తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. సమిష్టి కృషితో ప్రభుత్వ విద్యావ్యవస్థను దేశానికే దిక్సూచిగా మారుద్దాం…ఎపి మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం అంతా కలసికట్టుగా కృషిచేద్దాం. విద్యారంగాన్ని రాజకీయాలకు అతీతంగా ఉంచేందుకు వ్యవస్థలో పలు కీలకమైన సంస్కరణలు తెచ్చాం. సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో విద్యార్థిమిత్ర, డొక్కా సీతమ్మ గారి పేరిట మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాం. ప్రాథమిక విద్యలో నాణ్యత పెంచేందుకు 9600 స్కూళ్లలో వన్ క్లాస్ వన్ టీచర్ విధానాన్ని తెచ్చాం. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావుగారిని క్యాబినెట్ ర్యాంకుతో సలహాదారుగా నియమించాం. కారు, ఫోన్ తోపాటు కనీసం బాటిల్ నీరు కూడా ఆయన తీసుకోలేదు. ఆయన నిబద్ధతను అభినందిస్తున్నా. నైతిక విలువలపై తాను రాసిన నాలుగు పుస్తకాలను విద్యార్థులకు అందించాలని ఆయన కోరారు. మహిళలను గౌరవించడం నర్సరీ నుంచే నేర్పించాలి. మార్పు మన ఇంటినుంచే రావాలి. మా ఇంట్లో మా తల్లి నుంచే గౌరవిస్తున్నాం. 1,2 తరగతుల పుస్తకాల్లో ఇంటిపనుల ఫోటోలను చెరో సగంగా ఉండేలా మార్పులు చేశాం. పాఠశాల విద్యలో అనేక సంస్కరణలు తీసుకువచ్చాం. విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గించాం.. శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తున్నాం. నైతిక విలువలు, లింగ సమానత్వం, రాజ్యాంగం గురించి పాఠాలు రూపొందించామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
డిఎస్సీ అంటే సిబిఎన్…
తెలుగుదేశం పార్టీ విద్యకు ఎప్పుడూ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తోంది. సిబిఎన్ అంటే డిఎస్సీ… DSC అంటేనే TDP గా పేరుపడింది. ఇప్పటివరకూ 14 సార్లు డీఎస్సీలు నిర్వహించ 2 లక్షల టీచరు పోస్టులు భర్తీ చేశాం. సెప్టెంబర్ 5న టీచర్స్ డేకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు హాజరయ్యారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు నిర్వహించిన డీఎస్సీలో ఎంపికైన వారు చేతులు ఎత్తండని కోరితే…హాలులో 99 శాతం మంది చేతులు ఎత్తారు. ఇదీ తెలుగుదేశం పార్టీ ఘనత….ఇదీ చంద్రబాబు గారి డీఎస్సీల చరిత్ర. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున తొలి సంతకం మెగా డీఎస్సీ పై పెట్టారు. చాలా మంది నవ్వారు.. కొందరు విమర్శించారు. కానీ డీఎస్సీల నిర్వహణలో టీడీపీ, చంద్రబాబు గారి ట్రాక్ రికార్డు వీరెవ్వరికీ తెలియదు. బాబు గారు ఒక్కసారి కమిటైతే.. ఆ టాస్క్ కంప్లీట్ అయ్యే వరకూ ఆగరని ఈ డీఎస్సీ రిక్రూట్మెంట్ స్పష్టం చేసింది.
అడ్డుకోవాలనే కుట్రతో కేసులు వేయించారు
డీఎస్సీ ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదనే కుట్రతో కొందరు 150కిపైగా కేసులు వేయించారు. అధికారులు, న్యాయ సలహాలు తీసుకుంటూ ఎటువంటి లీగల్ సమస్యలు రాకుండా చూసుకున్నారు. 150 కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటూనే 150 రోజుల్లో డీఎస్సీ విజయవంతంగా నిర్వహించారు. మెగా డీఎస్సీ మెగా హిట్ కావడానికి కృషి చేసిన అధికారులు కోన శశిధర్, విజయరామరాజు, బి.శ్రీనివాసరావు, ఆకుల వెంకటరమణలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మెగా డీఎస్సీని ప్రభుత్వం 150 రోజుల్లోనే పూర్తిచేసి రికార్డు సృష్టించాం. సుమారుగా 16 వేల పోస్టులు ఒకేసారి భర్తీ చేయడం మరో రికార్డు. ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత నిర్వహించిన మొదటి డీఎస్సీ లోనే ఇంప్లిమెంట్ చేశాం. స్పోర్ట్స్ కోటా 3 శాతం ఈ డీఎస్సీలో అమలైంది. మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, స్పోర్ట్స్ కోటా సహా అన్ని కేటగిరీల్లో వెర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్లు పకడ్బందీగా పాటించాం. విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో పురుషులకు సమానంగా మహిళలకు అవకాశాలు దక్కాలని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పనిచేస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి అత్యధికంగా డీఎస్సీలో 49.9% పోస్టులను మహిళలకు దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది.
యువగళం యాత్రలోనే మెగా డిఎస్సీ ఆలోచన
ఇంట్లో మొదటి గురువు అమ్మ. హెడ్ మాస్టర్ నాన్న. బడిలో గురువులే అమ్మానాన్నలు. అమ్మానాన్నల తరువాత పిల్లలు ఎక్కువ ఉండేది టీచర్ల తోనే. ప్రపంచంలో ఒక గొప్ప ఆస్తి ఉంది. అది దొంగలు దోపిడీ చెయ్యలేరు. అన్నదమ్ములు వాటాలు అడగరు. ఇతరులు మోసం చేసి తీసుకోలేరు. అదే విద్య. ఎంతో విలువైన విద్యా ఆస్తిని మీరంతా పిల్లలకు ఇవ్వబోతున్నారు. యువగళం పాదయాత్ర నుండి పుట్టింది మెగా డీఎస్సి ఆలోచన. పాదయాత్ర లో నడిచేప్పుడు యువతీయువకులతో మాట్లాడేవాడిని. వాళ్ళు ఒక్కటే చెప్పేవారు. మేమంతా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నాం. వైసిపి ప్రభుత్వం ఒక్క డీఎస్సి కూడా నిర్వహించలేదు. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ వేయాలి అని కోరేవారు. అప్పుడే మెగా డీఎస్సీ ఆలోచన మొదలైంది. చంద్రబాబు గారు తొలి సంతకం డిఎస్సీపైన పెడతారని అప్పుడే చెప్పాను. నూతన ఉపాధ్యాయులంతా పట్టుదల, కమిట్ మెంట్ తో పనిచేయాలి. విద్యావ్యవస్థలో మార్పుతేవాలి. విద్య అంటే ఫిన్ ల్యాండ్, డిల్లీ మాత్రమే కాదు. ఆంధ్రా మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపంచానికి చూపాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. వ్యవస్థలో మార్పు తెస్తానని విద్యాశాఖను కోరి మరీ తీసుకున్నా. అందరం కలసికట్టుగా పనిచేద్దాం, ప్రపంచానికి ఆంధ్రామోడల్ చూపిద్దాం. అయిదేళ్లలో ప్రతి విద్యార్థికి గ్యారంటీడ్ ఎఫ్ఎల్ ఎన్ అందిద్దాం. ఉత్తమ ఉపాధ్యాయులను ఫిన్ ల్యాండ్, సింగపూర్ అధ్యయనానికి పంపించాలని ముఖ్యమంత్రి గారికి నా విన్నపం.
గురువుకు దక్కిన గొప్పగౌరవం
ఒక గురువు దక్కిన గొప్ప గౌరవం గురించి ఈ రోజు మీకు చెబుతాను. అది అక్టోబర్ 3 , 1996 సంవత్సరం. అప్పటి రాష్ట్రపతి గౌరవనీయులైన శంకర్ దయాళ్ శర్మ గారు ఒమన్ దేశం అధికారిక పర్యటనకు వెళ్లారు. మస్కట్ ఎయిర్ పోర్టుకు ఏకంగా ఒమన్ రాజు ఖబూస్ బిన్ సైద్ వచ్చేశారు. ఆ దేశ అధికారులంతా కంగారు పడిపోయారు. ప్రోటోకాల్ నిబంధనలు పక్కనపెట్టి రాజు గారు ఎయిర్ పోర్టుకి రావడం ఏంటని షాక్ అయ్యారు. తాము ఏమైనా తప్పు చేశామా అని అందరూ భయపడుతున్నారు. డాక్టర్ శంకర్ దయాళ్ శర్మను సాదరంగా స్వాగతించారు ఒమన్ రాజు. రాజు తన కారులో శంకర్ దయాళ్ శర్మను ఎక్కించుకుని, తానే డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్లారు. ఏమీ అర్థంకాని ఒమన్ ఉన్నతాధికారులు.. ప్రోటోకాల్ ఇలా బ్రేక్ అవడంపై సీరియస్ అయ్యారు. ఒమన్ రాజభవనంలోకి చేరాక తెలిసింది ఏంటంటే ఒమన్ రాజు గతంలో పూణేలో చదువుకున్నారు. అప్పుడు ఆయనకు పాఠాలు చెప్పింది మన శంకర్ దయాళ్ శర్మ గారేనట. ఒమన్ రాజు తన గురువుకి ఇచ్చిన గౌరవం చూశారు కదా. దేవుడు, గురువు ఒకేసారి ఎదురుపడితే మొదట గురువుకే నమస్కారం చేస్తానన్నారు గురు కబీర్ దాస్. అది గురువుల గొప్పతనం.
నాకు లైఫ్ టైమ్ గురువు చంద్రబాబు గారే
దేశానికి అధినేత అయినా గురువు దగ్గర చదువుకున్న విద్యార్థే. వరల్డ్ రిచ్చెస్ట్ పర్సన్ కూడా ఒక గురువుకు స్టూడెంటే. ఇంజనీర్, డాక్టర్, యాక్టర్, లీడర్, లాయర్… ఎవ్వరైనా ఓ గురువు వద్ద శిష్యుడే. సర్వేపల్లి రాధాకృష్ణన్ తనకు కృష్ణుడితో సమానమైన గురువు అని జాతిపిత మహాత్మా గాంధీ చెప్పారు. తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే బాలికా విద్య కోసం ఎంతగానో కృషి చేసారు. నాకు లైఫ్ టైం గురువు మా నాన్న గారు చంద్రబాబు గారు. మిమ్మల్ని చూస్తుంటే నా టీచర్లు గుర్తొచ్చారు. వాళ్లు చెప్పిన పాఠాలు, కొట్టిన దెబ్బలు ఇంకా నాకు గుర్తున్నాయి. స్కూల్ లో మాది గోల బ్యాచ్ … మేము ఫ్రెండ్స్ ఆఫ్ ఫస్ట్ బెంచర్స్. అంటే మాది లాస్ట్ బెంచ్. కానీ లాస్ట్ బెంచ్ నుండి స్టాంఫోర్డ్ కి నా ప్రయాణం ఎలా జరిగిందో మీకు చెబుతాను. స్కూల్ లో మంజులా మ్యాడం కొట్టిన దెబ్బలు, రమాదేవి మ్యాడం నేర్పిన డిసిప్లిన్ నాకు గుర్తున్నాయి. ఇంటర్ లో నారాయణ మాస్టారు బ్రిడ్జ్ కోర్సు. కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ రాజిరెడ్డి గారి డైరెక్షన్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రపంచంలో ఏ రంగంలో ఉన్నవారైనా, ఎంత గొప్పవారైనా తమ టీచర్లను గౌరవిస్తూ ఉంటారని మంత్రి లోకేష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, రాష్ట్ర మానవవనరుల శాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య కమిషనర్ విజయరామరాజు, సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరక్టర్ బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.