ఆయన మళ్లీ అధికారంలోకి రాలేరు… అందుకే ఈ కక్ష సాధింపు
స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఇప్పటివరకు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ని ఎందుకు విచారించలేదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో చంద్రబాబు పేరు ఎక్కడా లేకపోయినా ఎలా అరెస్టు చేస్తారని నిలదీశారు. డిజిటెక్ కంపెనీ గుజరాత్లో జీఎస్టీ కట్టకపోతే రాష్ట్రానికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. సీఐడీ పోలీసులు కనీస అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. స్కిల్ డెలవప్మెంట్ సంబంధించి కొనుగోలు చేసిన మెటీరియల్, వాటికి సంబంధించిన ఇన్వాయిస్లు ప్రభుత్వం వద్ద ఉన్నాయన్నారు. జగన్ ఒంటినిండా బురద ఉంది కాబట్టి దాన్ని చంద్రబాబుకి కూడా అంటించాలని చూస్తున్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి రాలేరు కాబట్టే ఇలాంటి కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. జగన్పై రూ.43 వేల కోట్లకి సంబంధించిన అవినీతి కేసులు ఉన్నాయి. అలాగే పలు సీబీఐ, ఈడీ కేసులూ ఉన్నాయి. కోడి కత్తి కేసులో జగన్ కోర్ట్కు వెళ్లకుండా సాకులు చెబుతున్నారు. కానీ చంద్రబాబు మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇంతటితో ఆగకుండా రాష్ట్రానికి వచ్చి స్కిల్ డెవలప్మెంట్ కింద శిక్షణ ఇచ్చిన వారిని కూడా వేధిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా 30 నుంచి 40 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. జగన్ తన వ్యక్తిగత కక్షతో ప్రజలను, రాష్ట్రానికి పణంగా పెడుతున్నారు అని అన్నారు.













