మాజీ మంత్రి కుతూహలమ్మ ఇక లేరు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం తెల్లవారుజామున తిరుపతిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. వైద్యురాలైన కుతూహలమ్మ చిత్తూరు జడ్పీ చైర్పర్సన్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఎక్కువకాలం కాంగ్రెస్లో పనిచేసిన ఆమె 2014లో తెలుగుదేశం పార్టీలో చేరారు. సుమారు ఏడాదిన్నర క్రితం టీడీపీకి రాజీనామా చేశారు. కుతూహలమ్మ 1985లో వేపంజేరి ( ప్రస్తుతం జీడీనెల్లూరు) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే స్థానం నుంచి 1989, 1999, 2004లోనూ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో వైద్యారోగ్యం, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందించారు. 2007లో ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. 1994లో కాంగ్రెస్ సీటు నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో జీడీ నెల్లూరు ఎమ్మెల్యే కాంగ్రెస్ తరపున గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఆమె టీడీపీతో చేరారు. జీడీనెల్లూరు నుంచి పోటీ చేసి ఓడిపోయరు.













