ఆంధ్రా అమ్మాయికి, అమెరికా అబ్బాయికి నిశ్చితార్థం
ఆంధ్రా అమ్మాయి, అమెరికా అబ్బాయి ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులు వారి వివాహానికి గ్రీన్ సిగ్నల్ చెప్పారు. దీంతో నిశ్చితార్థ వేడుకకు గోకవరం మండలం కృష్ణునిపాలెం వేదికయింది. కాకినాడకు చెందిన రాజాలా ఉదయశంకర్, కుసుమ దంపతులు విజయవాడలో స్థిరపడ్డారు. వారి కుమార్తె నివేదిత 2016లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరింది. ఆమెతో పాటు పనిచేస్తున్న చికాగోకు చెందిన బైరాన్ ఆమెను ఇష్టపడ్డాడు. ఇదే విషయాన్ని యువతికి చెప్పగా తన తల్లిదండ్రులకు ఇష్టమైతేనే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. వారి ప్రేమను అర్థం చేసుకున్న కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించడంతో గోకవరం మండలం కృష్ణునిపాలెంలో బంధువుల సందడి నడుమ నిశ్చితార్థ వేడుక నిర్వహించారు. ఈ నెల 11న విజయవాడలో వీరి వివాహం జరగనున్నట్టు వారి బంధువులు తెలిపారు.













