సింగపూర్కు రాజధాని రైతులు
రాజధానికి భూములిచ్చిన రైతుల బృందం అమరావతి నుంచి సింగపూర్కు బయలుదేరి వెళ్లింది. రైతు యాత్రను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జెండా ఊపీ ప్రారంభించారు. వెలగపూడి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రైతుల బృందం బయలుదేరింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి రైతులు సింగపూర్ వెళ్లనున్నారు. మొత్తం 123 మంది రైతుల్లో తొలి విడతగా 34 మందిని సింగపూర్కు ప్రభుత్వం పంపిస్తోంది. రైతులకు భోజన, వసతి సౌకర్యాలను ప్రభుత్వం కల్పించనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజధాని రైతులు సింగపూర్కు వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కోరారు. ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు అమరావతికి వస్తున్నాయని పేర్కొన్నారు. సింగపూర్ తరహాలో రాజధాని ఉంటుందని ముందు చేప్పానని గుర్తు చేశారు. రాజధానిలో కార్యాలయాల కోసం 7 టవర్లు నిర్మిస్తామని, రాజధానికి వచ్చేవారితో పోటీపడే స్థాయికి రైతులు ఎదుగాలని ఆయన ఆకాంక్షించారు. ఎదగడానికి సంపద అవసరం లేదని, సంకల్పం ఉండాలన్నారు. వ్యాపారాల్లో ఎదిగేందుకు అన్ని విధాలుగా అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.













