సీఎం వైఎస్ జగన్ పారిస్ పర్యటన ఖరారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పారిస్ పర్యటన ఖరారు అయింది. ఈ నెల 28న ఫ్రాన్సుకు వెళుతున్నారు. తన పెద్ద కుమార్తె హర్ష అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంబీఏ) పూర్తి చేసుకోవటంతో గ్రాడ్యుయేషన్ డే వేడుకలో పాల్గొనటానికి సీఎం వెళుతున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది. ఈ నెల 28న రాత్రి బయలుదేరనున్న ముఖ్యమంత్రి 29న పారిస్ చేరుకుంటారు. కుమార్తె గ్రాడ్యుయేషన్ డే వేడుకలో పాల్గొని జులై 2న తిరిగి ప్రయాణమవుతారు. మేనేజ్మెంట్ విద్యకు సంబంధించిన ప్రపంచంలో నెంబర్ 1గా ఉన్న ఇన్సీడ్ సంస్థకు అమెరికాలోని ప్రఖ్యాత వార్టన్ బిజినెస్ స్కూల్, సింగపూర్లోని ఇన్సీడ్ ఆసియా అనుబంధ క్యాంపస్లు. హర్ష తన అండర్ గ్రాడ్యుయేషన్ను కూడా యూకేలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన లండన్ స్కూల్ ఆప్ ఎకనమిక్స్ నుంచి పూర్తి చేశారు. జులై 3వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడకు చేరుకుంటారు.













