నగదుపై ఆంక్షలు : రూ.2లక్షలు దాటితే 2లక్షలు ఫైన్
రెండు లక్షలు, అంతకు మించి నగదు లావాదేవీలు చేయడం చట్ట విరుద్ధమంటుంది ఆదాయపన్ను శాఖ. అలాంటి లావాదేవీలకు పాల్పడితే చట్టప్రకారం జరిమానా తప్పదని దేశ ప్రజలను హెచ్చరిస్తూ ఓ ప్రకటన జారీ చేసింది ఆదాయపన్ను శాఖ. ఒక సంఘటన లేదా సందర్భానికి సంబంధించి రూ.2 లక్షలు, అంతకు మించిన సొమ్ము ఒక వ్యక్తి నుంచి, ఒక రోజులో ఒక లావాదేవీలో కానీ, పలు లావాదేవీల్లో కానీ తీసుకోవడం నిషిద్ధం అని ఆ ప్రకటనలో పేర్కొంది.
స్థిరాస్తి బదిలీ కోసం రూ.20 వేలకు మించి నగదు తీసుకోవడం కానీ, ఇవ్వడం కానీ చేయరాదు. వృత్తిపరమైన, వ్యాపారపరమైన ఖర్చులు రూ.10 వేలకు మించి క్యాష్గా చెల్లించరాదంటుంది ఇన్ కం టాక్స్ డిపార్టుమెంటు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవు. క్యాష్లెస్ లావాదేవీలు జరపండి. పారదర్శకంగా ఉండండి అని సూచిస్తుంది.
అలాంటి ఉల్లంఘనలకు ఎవరైనా పాల్పడుతుంటే ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్కు ఈ మెయిల్ ద్వారా (blackmoneyinfo@incometax.gov.in) సమాచారం అందించాలని ఆ ప్రకటనలో చెప్పింది ఆ శాఖ. బడ్జెట్లో భాగంగా చేసిన చట్టసవరణ ద్వారా ఏప్రిల్ 1 నుంచి రెండు లక్షల నిబంధన అమల్లోకి వచ్చింది. ఆదాయ పన్ను చట్టంలో చేర్చిన 269ఎస్టీ నిబంధన ప్రకారం… రెండు లక్షల నిబంధన ఉల్లంఘించిన వారికి వందశాతం జరిమానా వేస్తారు. బ్యాంకులు, పోస్టాఫీసులు, సహకారబ్యాంకులకు ఈ నిబంధన వర్తించదు. నల్లధనాన్ని నియత్రించేందుకే నగదు లావాదేవీలపై పరిమితి విధించారు.













