కూచిభొట్ల హంతకుడికి మూడు జీవిత ఖైదులు
తెలుగు టెకీ కూచిభొట్ల శ్రీనివాస్ (32)ను గత ఏడాది అమెరికాలోని కేన్సస్లో హత్యచేసిన ఆడమ్ ప్యూరింటన్కు అక్కడి జాన్సన్ కౌంటీ డిస్ట్రిక్ట్ కోర్టు మూడు యావజ్జీవ కారాగార శిక్షలు విధించింది. ఈ శిక్షలు మూడింటినీ అతడ ఒకదాని తర్వాత మరొకటిగా అనుభవించాలని జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు. 2017 ఫిబ్రవరి కాన్సస్లోని ఒక బార్లో శ్రీనివాస్ పైనా, మరో ఇద్దరిపైనా జాతివిద్వేష వ్యాఖ్యలు చేస్తూ ప్యూరింటన్ కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. తాను జాతివిద్వేషంతోనే ఈ ఘోరానికి పాల్పడినట్టు అతడు కోర్టులో అంగీకరించాడు. కాగా, ప్యూరింటన్ తన భర్తతో మాట్లాడి ఉంటే, శ్వేతజాతీయులు కానివారంతా చెడ్డవారు కారని తన భర్త అతడికి చక్కగా అర్థమయ్యేలా చెప్పేవారని శ్రీనివాస్ భార్య సునయన ఒక ప్రకటనలో తెలిపారు.













