డొనాల్డ్ ట్రంప్ వేధించారు విచారణ చేపట్టండి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమతో అసభ్యంగా ప్రవర్తించారని గతంలో ముగ్గురు మహిళలు సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆ ముగ్గురు మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. తాము చేసిన ఆరోపణలపై అమెరికా ఉభయసభలు విచారణ చేపట్టాలని వాళ్లు డిమాండ్ చేశారు. రేచల్ క్రూక్స్, జెస్సికా లీడ్స్, సమంతా హోల్వేలు మీడియా సమావేశంలో వెల్లడించారు. పార్టీలను పక్కన పెట్టి, ట్రంప్ అనైతిక ప్రవర్తనపై విచారణ చేపట్టాలని ఆ ముగ్గురు మహిళలు కాంగ్రెస్ను వేడుకున్నారు. మహిళల పట్ల ట్రంప్ ప్రవర్తన సరిగా లేదని గతంలో డెమోక్రటిక్ ఎంపీలు కూడా ఆరోపణలు చేశారు. ట్రంప్ లైంగిక ఆరోపణలపై విచారణ చేపట్టాలని సుమారు 60 మంది కాంగ్రెస్ మహిళా ఎంపీలు డిమాండ్ చేశారు.
ఇటీవల ఓ హాలీవుడ్ నిర్మాత హీరోయిన్ను లైంగికంగా వేధించారన్న ఘటన తర్వాత అమెరికాలో మీ టూ క్యాంపేన్ జోరుగా సాగుతున్నది. తమపై జరుగుతున్న వేధింపులను మహిళలు బహిరంగంగా వెలుబుచ్చుతూ మీ టూ ట్విట్టర్ క్యాంపేన్లో పాల్గొంటున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటున్న మహిళలకు రక్షణ ఇవ్వాలని డెమోక్రటిక్ మహిళా ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో వాళ్లు హౌజ్ కమిటీకి లేఖ కూడా రాశారు. ట్రంప్ ప్రవర్తనపై వచ్చిన ఆరోపణల అంశంలోనూ విచారణ చేపట్టాలని అమెరికా ఉభయసభలు మహిళా నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు ప్రెసిడెంట్ పట్ల మహిళలు చేసిన ఆరోపణలను వైట్హౌజ్ ఖండించింది.













