టాంటెక్స్ ఆధ్వర్యంలో డల్లాస్ లో ఘనంగా ముగిసిన మరో అష్టావధానం
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” 137వసాహిత్య సదస్సును ఆదివారం, డిసెంబరు 16న డాలస్ లో శ్రీ వీర్నపు చినసత్యం గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ప్రవాసంలో నిరాటంకంగా 137 నెలలుగా సాహితీ వేత్తల నడుమ ఈ సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ ప్రత్యేకత. ప్రవాస భారత సాంస్కృతిక రాజధాని డాలస్ లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో తరలి వఛ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేశారు. ముందుగా స్వాతి కృష్ణమూర్తి శిష్య బృందం అయిన లాస్య కండేపి, సహస్ర కాసం, సాన్విక కాసం, మనోజ్ఞ బొమ్మదేవర, ప్రితిక పలనిసేల్వం, దీప్తి గాలి, దర్శిత రాకం, శ్రీఆద్య ఊర, శ్రీనిధి తటవర్తి ప్రార్ధనా గీతం ఆలపించారు. కార్యక్రమం లో భాగంగా ఈ సంవత్సరం లొ జరిగిన కార్యక్రమాల సింహావలోకనం జరిగింది. నెలల వారిగా వచ్చిన అతిదుల మరియు వారు ప్రసంగించిన అంశాల మీద చర్చ జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి సలహాలు సేకరించారు.
అవధానం కు ప్రారంభ సూచకంగా మంజు తెలిదేవర శిష్య బృందం అయిన అనిక మల్లెల, అరుణ గోపాలన్ , ద్రువ్ చిట్టిప్రోలు , సుమిత్ చిట్టిమల్ల, భవాని, ఈషాని గీతం ఆలపించారు. తరువాత సాహితి వేముల, సింధూర వేముల మరియు సమన్విత మాడ గరుడ గమన గీతం ఆలపించారు. అమెరికా లో స్థిరనివాసం వుంటున్న డా. పుదూర్ జగదీశ్వరన్ అవధాని గా ఎదిగి ఇటు ఇంటా అటు బయటా దిగ్విజయంగా అవధాన జైత్రయాత్ర చేయడం అందరినీ అబ్బురపరచే విషయం. అందరిలో ఉత్కంఠను రేపిన ఈ అవధాన కార్యక్రమానికి జువ్వాడి రమణ గారు సంధాతగా, డా. తోటకూర ప్రసాద్ వ్యస్తాక్షరి, కాజ సురేష్ నిషిధ్ధాక్షరి, భాస్కర్ రాయవరం సమస్య, డా. సుధ కలవగుంట న్యస్తాక్షరి, డా. ఊరిమిండి నరసింహారెడ్డి దత్తపది, వేముల లెనిన్ వర్ణన, వీర్నపు చినసత్యం ఘంటాగణనం, దయాకర్ మాడ అప్రస్తుత ప్రసంగం అంశాలకు పృచ్చకులుగా వ్యవహరించారు. లేఖకులుగా శ్రీ బాసబత్తిన, రమణ దొడ్ల మరియు కృష్ణ కోడూరి గారు భాద్యతలు నిర్వహించారు. ముఖ్యఅతిధి గా విచేసిన అమెరికా అవధాని గా పేరుగాంచిన డా. పుదూర్ జగదీశ్వరన్ గురు వందనం తో మొదలెట్టి కార్యక్రమము ఆద్యంతం ఎలాంటి తొట్రుపాటు లేకుండా చలాకీగా నవ్వుతూ నవ్విస్తూ సమస్యలను పూరిస్తూ అందరినీ అలరింపచేసాడు. ‘ వాజియు నెక్కెను పఠాని ప్రాకట ఫణితిన్’ అన్న సమస్యని శివాజీ కి వర్తింప చేస్తూ గడుసుగా పూరించారు, పెరుగు, అరుగు, మరుగు, తరుగు పదాలను ఉపయోగిస్తూ మానవ సమతుల్య జీవనానికి సూత్రాలను దత్తపది లొ పూరించారు. వరూధినీ సౌందర్యాన్ని నిషిద్దాక్షరి లొ లాఘవంగా పూరించారు. 20 అక్షరాల ఉత్పలమాల పాదాన్ని వ్యస్తాక్షరి లొ చేదించారు. ఆద్యంతమూ అప్రస్తుత ప్రసంగం సభికులను నవ్వుల్లో ముంచెత్తింది. అవధాని కూడా చిలిపి ప్రశ్నలకు గడుసు సమాధానాలు ఇచ్చారు. అప్పుడే కార్యక్రమం ముగిసిందా అనిపిస్తూ అవధాని చివరగా అన్ని పద్యాలను అవలీలగా ధారణ చేయడంతో అవధానం దిగ్విజయంగా ముగిసింది. సభికుల హర్షద్వానాల మధ్య ఉత్తర టెక్సస్ తెలుగుసంఘం (టాంటెక్స్) అధ్యక్షురాలు కృష్ణవేణి శీలం , ఉత్తరాధ్యక్షులు శ్రీ చినసత్యం వీర్నపు , ఉపాధ్యక్షుడు కోడూరు కృష్ణారెడ్డి, సతీష్ బండారు, కోశాధికారి పాలేటి లక్ష్మి ఇతర కార్యవర్గ సభ్యులు, సాహిత్య వేదిక కమిటి సభ్యులు డా. పుదూర్ జగదీశ్వరన్ ను జ్ఞాపిక , దుశ్శలువాతో సన్మానించి, “అవధాన విరించి”బిరుదుతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో సుబ్బు జొన్నలగడ్డ, ఆనంద్ మూర్తి కూచిభోట్ల, జగదీశ్వర్ రావు, పులిగండ్ల విశ్వనాధ్, డా. ప్రసాద్ తోటకూర, C.R. రావు , రామకృష్ణ రోడ్ద ప్రముఖులు పాల్గొన్నారు. సమన్వయకర్త వీర్నపు చినసత్యం సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన టీవీ 5, మన టి.వి, టీవీ 9,టి.ఎన్.ఐ, ఏక్ నజర్ లకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు. కార్యక్రమంలోని ఛాయాచిత్రాలను ఈ లంకెలో చూడవచ్చును.













