గుండెపోటును ముందుగానే పసిగట్టే వ్యవస్థ
కారు లేదా బస్సు లేదంటే ఓ ట్రక్కులాంటి వాహనాన్ని నడుపుతున్న వ్యక్తికి గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి హెచ్చరించే సరికొత్త విధానం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. శాస్త్రవేత్తలు ఈ తరహా వ్యవస్థ రూపకల్పనలో నిమగ్నమై ఉన్నారు. ఈ వ్వవస్థ కనుకు అందుబాటులోకి వస్తే, రోడ్డు ప్రమాదాలను కొంతమేరకు నిలువరించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఎన్నో రోడ్డు ప్రమాదాలకు వైద్యపరమైన కారణాలే దారితీసిన ఘటనలు కోకొల్లలు అని మిచిగన్ విశ్వవిద్యాలయానికి చెందిన కవ్యన్ నజారియన్ తెలిపారు.
సరిగ్గా ఈ తరహా పరిస్థితులను ముందు గుర్తించి హెచ్చరించి తద్వారా ప్రాణనష్టాన్ని, ప్రజలు గాయాల పాలవడాన్ని నివారించే వ్యవస్థ రూపకల్పన అవసరాన్ని తాము గుర్తించామన్నారు. అందులో భాగంగానే జపాన్ సంస్థ టొయోటోతో కలిసి, ముందుగానే డ్రైవర్లకు రానున్న గుండెపోటు ప్రమాదాన్ని హెచ్చరించే వ్వవస్థ రూపకల్పనలో పడ్డామన్నారు. ముందుగా అమెరికా ఆహార, ఔషధ పాలనాయంత్రాంగం ఆమోదముద్ర పొందిన గుండె మానిటర్లను డ్రైవర్లకు తప్పనిసరిగా అమరుస్తారు. ఓ ప్యాచ్ రూపంలో ఉండే ఈ మానిటర్ను డ్రైవరు ఛాతివద్ద అమరుస్తారు. గుండెపోటు ముప్పు ఉంటే కనుక, ఈ మానిటర్ ముందే హెచ్చరిస్తుంది. తద్వారా డ్రైవరుతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడవచ్చని పరిశోధకులు తెలిపారు.













