కచ్చితంగా తమ భేటీ జరగాలని వేడుకున్నారు!
ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఈ నెల 12న సింగపూర్లో భారత కాలమాన ప్రకారం ఉదయం 6:30 గంటలకు సమావేశం కానున్నారు. అయితే కచ్చితంగా తమ భేటీ జరగాలని నియంత కిమ్, అగ్రరాజ్యాధినేత ట్రంప్ను బతిమాలారట. ఈ విషయాన్ని న్యూయార్క్ మాజీ మేయర్, ట్రంప్ లాయర్ రుడీ గిలియానీ వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తమ భేటీ రద్దు చేసుకుంటున్నట్లు ట్రంప్ తొలుత కిమ్కు లేఖ ద్వారా సందేశం పంపారు. కానీ కిమ్ తన మనసు మార్చుకుని ట్రంప్ను ప్రాధేయపడ్డారు. జూన్ 12న సింగపూర్లో ఎలాగైనా సరే సమావేశం జరిగేలా ఏర్పాటు చేయాలని కిమ్ అమెరికా అధ్యక్షుడికి రాసిన లేఖలో చేతులు జోడించి మరీ మోకరిల్లారు. కిమ్ తీరు నచ్చక ట్రంప్ తమ సమావేశం రద్దు చేసుకోగా, నిర్ణయంపై పునరాలోచించాలని కిమ్ అడుక్కున్నారు(బెగ్గింగ్). దీంతో ట్రంప్ తన మనసు మార్చుకున్నారంటూ ట్రంప్ లాయర్ రుడీ గిలియానీ వివరించారు.













