అమెరికా కంపెనీ గుడ్న్యూస్…
అత్యాధునిక వీడియో సెషన్స్ కు పేరొందిన అమెరికాకు చెందిన జూమ్ యాప్ దేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో రాబోయే ఐదేళ్లలో భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. కాగా కొందరు జూమ్ యాప్ చైనాకు సంబంధించినదిగా ప్రచారం చేస్తున్నారని, అందులో ఏ మాత్రం నిజం లేదని జూమ్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్ ప్రెసిడెంట్ శంకర్లింగమ్ తెలిపారు. దేశంలో వినియోగదారులకు జూమ్ యాప్ వీడియో కాలింగ్స్, వీడియో మీటింగ్స్ ద్వారా మెరుగైన సేవలదిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల కాలంలో సరిహద్దు వివాదాల నేపథ్యంలో భారత్, చైనా సంబంధాలు క్షీణించిన విషయం విదితమే.
ప్రస్తుతం జూమ్ యాప్ 40 నిమిషాల వీడియో ఫ్రీ కాలింగ్ సేవలు అందిస్తుంది. మరోవైపు దేశీయ వ్యాపారాలు, ప్రభుత్వ ఏజన్సీలు, స్కూల్ టీచర్లకు జూమ్ యాప్ మెరుగైన సేవలందిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో మూడు నగరాల్లో జూమ్ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. కాగా సెక్యూరిటీ, ప్రైవసీ కొరకు 100 ఫీచర్లు అందిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. దేశంలో అన్ని రంగాలలో దూసుకెళ్తున్న రిలయన్స్ జియో సంస్థ తాజాగా జూమ్ యాప్కు పోటీగా జియో మెట్ (వీడియో కాలింగ్) యాప్ను విడుదల చేసింది. అయితే జియో మీట్ పోటీని తట్టుకునేందుకు జూమ్ సంస్థ అనేక వ్యూహ్యాలు రచిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.













