డొనాల్డ్ ట్రంప్ టవర్ లో మరోసారి కలకలం
న్యూయార్క్లోని ట్రంప్ ట్రవర్స్లో మరోసారి కలకలం రేగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన మాన్హట్టన్లోని టవర్వద్ద కనిపించిన పలు అనుమానాస్పద ప్యాకేజీలు న్యూయార్క్ పోలీస్ విభాగానికి చెమటలు పట్టించాయి. ప్రాథమిక పరిశీలన అనంతరం ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే విచారణ జరుగుతోందని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ ట్విటర్లో ప్రకటించింది. ట్రంప్ సొంతమైన 58 అంతస్థుల భవనం వద్ద మొదట రెండు అనుమానాస్పద ప్యాకెట్లను భద్రత సిబ్బంది గమనించారు. అనంతరం జరిపిన విస్తృత పరిశోధనలో మరో రెండు ప్యాకెట్లు లభించడంతో అక్కడి అధికారుల్లో ఆందోళన మొదలైంది. హుటాహుటిన బాంబ్ స్క్వాడ్ని పిలిపించి తనిఖీలు చేపట్టారు. భవనంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో అనుమానాస్పద వస్తువులను గమనించామని పోలీసు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఎన్వైపీడీ ప్రజా సమాచార అధికారి సెర్జెంట్ విన్సెంట్ మార్చీజ్ తెలిపారు.













