బోస్టన్ లో ఇళయరాజా పాటల హోరు
నాట్స్ బోస్టన్ ఛాప్టర్ ఆధ్వర్యంలో కార్యక్రమం
తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న నాట్స్.. బోస్టన్ లో ఇళయరాజా పాటల కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించింది. బోస్టన్ ప్రాంతంలో నివసిస్తున్న తెలుగువారిలో గాన మాధుర్యం ఉన్న కళకారులను ప్రోత్సాహించే ఉద్దేశంతో నాట్స్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మధుచారి ఆధ్వర్యంలో21 మందితో గాయనీ, గాయకులతో కూడిన మధురవాణి బృందం… ఇళయరాజా స్వరపరిచిన పాటలను అద్భుతంగా గానం చేసి తెలుగు ప్రేక్షకులకు ఆనాటి రోజులను గుర్తు చేసింది. ఆద్యంతం ఈ కార్యక్రమం ఎంతో ఆహ్లదభరితంగా సాగింది. ఐదుగురితో కూడిన వ్యాఖ్యతల బృందం మధ్య మధ్యలో ఇళయారాజా సాధించిన సంగీత విజయాలు.. ఆయన గురించి ఆసక్తికరమైన విషయాలను వివరిస్తూ.. కార్యక్రమానికి వన్నె తెచ్చారు. సెయింట్ లూయిస్, న్యూజెర్సీల నుండి విచ్చేసిన నాట్స్ అధ్యక్షులు శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ బోర్డ్ సభ్యులు మోహన్ కృష్ణ మన్నవ , శ్రీహరి మందాడి, రంజిత్ చాగంటి, వంశీ వెనిగళ్ల తదితరులు నాట్స్ బోస్టన్ విభాగం చేస్తున్న కార్యక్రమాలపై ప్రశంసల వర్షం కురిపించారు. నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఇంకా ఈ పాటల కార్యక్రమంలో పాల్గొన్న మధురవాణి బృంద సభ్యులను, వ్యాఖ్యాతలను శాలువలతో ఘనంగా సత్కరించారు।
స్థానిక తెలుగు సంఘం తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ బోస్టన్ ఏరియా ప్రెసిడెంట్ సీతారాం అమరవాదితో పాటు పలువురు స్థానిక తెలుగు ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. దాదాపు 250 మందికి పైగా స్థానిక తెలుగు వారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇళయారాజా పాటల సందడిలో మధురానుభూతులు పొందారు.
ఇళయరాజా పాటల కార్యక్రమం మధురవాణిని ఇంత గొప్పగా విజయవంతం చేసినందుకు ఈ బృందంలో పాడిన గాయని, గాయకులకు నాట్స్ బోస్టన్ విభాగం అధ్యక్షులు శ్రీనివాస్ గొంది గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ పాటల కార్యక్రమాన్ని విజయవంత చేయడంలో నాట్స్ టీం సభ్యులు కూడా ఎంతో కృషి చేశారని… ఇదే ఉత్సాహంతో మరిన్ని కార్యక్రమాలను బోస్టన్ లో చేపడతామని శ్రీనివాస్ గొంది ప్రకటించారు.













