జియోలో మరో భారీ పెట్టుబడులు
రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని రిలయన్స్ జియో విదేశీ పెట్టుబడులతో దూసుకుపోతోంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్, ప్రైవేటు ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ ఒప్పందాలతో జోరుమీదున్న జియో తాజాగా అమెరికాకు చెందిన విస్టా ఈక్విటీ పార్టనర్స్ కంపెనీతో మరో మెగా ఒప్పందానికి సన్నద్ధమైంది. ఈ ఒప్పందం ద్వారా ఆర్ఐఎల్కు రూ.11,367 కోట్లు సమకూరనున్నాయి. ఈ ఒప్పందంలో ఈక్విటీ విలువ రూ.4.91 లక్షల కోట్లు, ఎంటర్ప్రైజ్ విలువ రూ.5.16 లక్షల కోట్లు అని రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ప్లాట్ఫామ్లు శుక్రవారం ప్రకటించాయి. దీంతో విస్టా జియోలో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా నిలిచింది. కేవలం రెండు వారాల్లోనే అమెరికాకి చెందిన మరో కంపెనీ జియోలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం విశేషం. తమ ఇతర భాగస్వాముల మాదిరిగానే, విస్టా కూడా భారతీయ డిజిటల్ పర్యావరణ వ్యవస్థ ద్వారా భారతీయులందరికీ ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో తమతో జత కట్టిందని ఆర్ఐఎల్ చైర్మన్, ఎండీ ముకేశ్ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. తాజా పెట్టుబడులతో ప్రముఖ టెక్నాలజీ ఇన్వెస్టర్ల నుంచి రూ.60,596.37 కోట్లు పెట్టుబడులను మూడు వారాల్లో సేకరించగలిగామని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది.













