అమెరికాలో ఎమ్మెస్ చేయాలనుకునే విద్యార్థులకు శుభవార్త
అమెరికాలో ఎమ్మెస్ చేయాలనుకునే విదేశీ విద్యార్థులకు శుభవార్త. ఇప్పుడు జీఆర్ఈ స్కోరు లేకున్నా పర్వాలేదు. ఎమ్మెస్లో ప్రవేశానికి ప్రామాణిక అర్హతగా పరిగణించే జీఆర్ఈ (గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్) స్కోరు నుంచి ఈ ఏడాది అమెరికన్ వర్సిటీలు మినహాయింపు ఇస్తున్నాయి. కరోనా నేపథ్యంలో దాదాపు 65 వర్సిటీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఉక్లాస్ ఆండర్సన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, నార్త్ ఈస్టర్న్ వర్సిటీలు విద్యార్థుల జీపీఏ ఆధారంగా ప్రవేశాలు కల్పించేందుకు ముందుకొస్తున్నాయి. అదేవిధంగా క్లెవ్ల్యాండ్ స్టేట్ వర్సిటీ, రోహన్ వర్సిటీ, టెక్సాస్ ఏఅండ్ఎం కామర్స్, ఫెయిర్లీ డికిన్సన్ వంటి ప్రముఖ వర్సిటీలు తక్కువ స్కోరు ఉన్న వారు సైతం దరఖాస్తు చేసుకునేలా నిబంధనలను సడలించాయి. కొన్ని వర్సిటీలు జీఆర్ఈకి బదులుగా డ్యుయోలింగ్ టెస్ట్, ఐఈఎల్టీఎస్ స్కోరు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
విదేశాల్లో ఎమ్మెస్ చేయాలనుకునే వారిలో ఎక్కువ శాతం మంది అమెరికానే తొలి ప్రాధాన్యంగా ఎంచుకుంటారు. అయితే అక్కడ ప్రముఖ వర్సిటీలు ఐఈఎల్టీఎస్ లేదా టోఫెల్తోపాటు జీఆర్ఈ స్కోరును తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటాయి. ఆ స్కోరు ఉన్నవారికే సీట్లు ఇస్తాయి. అయితే నాన్ టెక్నికల్ బ్యాక్గ్రాండ్ అభ్యర్థులు జీఆర్ఈ స్కోరును సాధించడంలో వెనుకబడుతున్నారు. ఇప్పుడు వీరంతా ఈ మినహాయింపు అవకాశాన్ని ఉపయోగించుకోనున్నారు.













