ప్రముఖ దిగ్గజ దర్శకుడు తాతినేని రామారావు కన్నుమూత : సినీ ప్రముఖుల సంతాపం
ప్రముఖ దిగ్గజ దర్శకుడు తాతినేని రామారావు (84) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత రాత్రి 12 గంటల సమయంలో చెన్నై లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. చిత్రసీమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఈ మధ్యకాలంలో కరోనా, ఇతరత్రా ఆనారోగ్య కారణాల వల్ల కొందరు సినీ ప్రముఖులను కోల్పోయింది సినీ ఇండస్ట్రీ. తాజాగా మరో వార్త సినీ లోకాన్ని విషాదంలోకి నెట్టేసింది. ప్రముఖ దిగ్గజ దర్శకుడు తాతినేని రామారావు (84) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత రాత్రి 12 గంటల సమయంలో చెన్నై లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
1938లో కృష్ణా జిల్లా, కపిలేశ్వరపురంలో జన్మించిన తాతినేని రామారావు.. 1966 సంవత్సరం నుంచి 2000 వరకు తెలుగు, హిందీలో 70కి పైగా చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. టి.రామారావుగా ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. హిందీలో సూపర్ హిట్ అయిన పలు చిత్రాలను తెలుగులో రూపొందించి సక్సెస్ అయ్యారు. ఆయన దర్శకుడిగా పని చేసిన చిత్రాల్లో సగం రీమేక్లే ఉండటం గమనార్హం. అలా `తెలుగువారి హిందీ దర్శకుడు` అనే పేరు సంపాదించారు. 1966లో అక్కినేని నాగేశ్వర రావు హీరోగా ‘నవరాత్రి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన తాతినేని రామారావు ”యమగోల, జీవన తరంగాలు, ఆలుమగలు, దొరబాబు, న్యాయానికి సంకెళ్లు, అనురాగ దేవత లాంటి ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు. యమగోల సూపర్ హిట్ కావడంతో ఆయన పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. యమగోల దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది.
సీనియర్ దర్శకుడు తాతినేని రామారావు మృతిపై నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని పేర్కొన్నారు. తెలుగు, హిందీ రెండు భాషల్లోనూ ఫేమస్ అయిన డైరెక్టర్ తాతినేని రామారావు గత రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రామారావు మృతిపై నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.”తాతినేని రామారావు గారి మరణ వార్త నన్నెంతగానో కలచివేసింది. దర్శకుడు అనే మాటకు వన్నె తెచ్చిన దర్శకులు తాతినేని రామారావు గారు. ఆయన ఈ రోజు మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. నాన్నగారితో చరిత్రలో నిలిచిపోయే ‘యమగోల’ లాంటి విజయవంతమైన చిత్రాలు తీసి మేటి దర్శకులుగా నిలిచారాయన. ఆయన దర్శకత్వంలో నేను కథానాయకుడిగా చేసిన ‘తల్లితండ్రులు’ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను అలరించి అభిమాన చిత్రంగా నిలిచింది. నిర్మాత పక్షాన నిలబడే దర్శకుల్లో ఆయన ఒకరు. సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీపడకుండా నిర్మించే ప్రతిభ తాతినేని రామారావు గారి సొంతం. బాలీవుడ్ లోనూ హిట్ చిత్రాలు తీసి అక్కడా విజయవంతమైన దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. తాతినేని రామారావు గారి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని బాలయ్య బాబు పేర్కొన్నారు.













