సునీల్కి షాక్ ఇచ్చిన లాక్డౌన్!
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి అందరికీ తెలిసిందే. పలు దేశాల్లో కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా ఎంతోమంది తమ ఉపాధిని కోల్పోయారు. ముఖ్యంగా అధిక జనాభా కలిగిన మన దేశంలో లాక్డౌన్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. పెద్ద పెద్ద కంపెనీల్లో సైతం కాస్ట్ కటింగ్ చేస్తున్నారు. ఇక సినీ పరిశ్రమ విషయానికి వస్తే ఇకపై పెద్ద హీరోలతో సినిమాలు చెయ్యాలంటే నటీనటులతోపాటు సాంకేతిక నిపుణులు కూడా తమ రెమ్యునరేషన్లో కోత విధించుకోవాల్సిందేనని నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. దీనికి భిన్నంగా దర్శకుడు బోయపాటి శ్రీను క్యారెక్టర్నే కుదించాడట. వివరాల్లోకి వెళితే.. లాక్డౌన్ కారణంగా కొన్ని నెలలుగా షూటింగులు ఆగిపోయాయి.
ఈ సమయంలో కొంతమంది డైరెక్టర్లు తాము రాసుకున్న కథలకు కాస్త పదును పెట్టే పని చేపట్టారు. బోయపాటి శ్రీను కూడా అదే పనిచేశాడు. బాలకృష్ణతో చేస్తున్న కొత్త సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ని మరోసారి తిరగరాసుకున్నాడట. ఆ క్రమంలో కమెడియన్ సునీల్ క్యారెక్టర్పై దృష్టి పెట్టాడట. ఈ చిత్రంలో సునీల్ క్యారెక్టర్ త్రో ఔట్ వుంటుందట. ఎమోషనల్గా, ఎంతో స్పీడ్గా సాగుతున్న కథలో సునీల్ కామెడీ స్పీడ్ బ్రేకర్గా మారిందని భావించిన బోయపాటి.. సునీల్ క్యారెక్టర్ లెంగ్త్ని కట్ చేశాడట. ఈమధ్యే షూటింగులకు అనుమతి ఇవ్వడంతో ఈ సినిమాకి సంబంధించి తాజా షెడ్యూల్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకుముందు ఇచ్చిన డేట్స్ని తగ్గించుకోమని, క్యారెక్టర్ లెంగ్త్ తగ్గిందని సునీల్కి చెప్పారట. అలా లాక్డౌన్ ఎఫెక్ట్ సునీల్పై పడింది. ఇక సినిమా విషయానికి వస్తే ఇటీవల నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజున విడుదలైన బిబి3 టీజర్ 8 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ టీజర్ సినిమాపై అంచనాలను భారీగానే పెంచిందని చెప్పొచ్చు.













