పవన్ తో కలిసి సెట్లో ఎప్పుడెప్పుడు అడుగుపెట్టాలా అని ఆతృతగా ఎదురు చూస్తున్నా! – రానా
పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా మళయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. రానా దీనిపై స్పందిస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. రెండేళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత కెమెరా ముందుకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకోటంతో తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే మళయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా తెలుగు రీమేక్ని నేడు (సోమవారం) లాంఛనంగా ప్రారంభించారు పవన్. ఈ మూవీలో పవన్తో పాటు దగ్గుబాటి రానా కూడా నటిస్తుండటం విశేషం.
ఈ నేపథ్యంలో తాజాగా పవన్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని తెలుపుతూ తన ఫీలింగ్స్ బయటపెట్టారు రానా. స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడంలో ఎప్పుడూ ముందుంటాడు రానా. విలక్షణ కథలను ఎంచుకుంటూ వెండితెరపై తన మార్క్ చూపించడం రానా స్టైల్. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ కళ్యాణ్తో కలిసి నటించడంపై ట్వీట్ చేసిన ఆయన.. ”సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్తో కలిసి నటించాను. కానీ.. మన పవర్ స్టార్తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఈ మూవీ సెట్లో ఎప్పుడెప్పుడు అడుగుపెట్టాలా అని ఆతృతగా ఎదురు చూస్తున్నా” అని పేర్కొన్నారు.
సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్స్మెంట్స్ బ్యానర్పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. థమన్ బాణీలు కట్టనున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. జనవరి నెల ఆరంభంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్లు తెలుస్తోంది. అతిత్వరలో చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనుంది చిత్రయూనిట్.













