”కేవలం పనికొచ్చే వార్తలు మాత్రమే వింటా” – రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ఓ పోస్ట్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ”కేవలం పనికొచ్చే వార్తలు మాత్రమే వింటా” అంటూ ఆయన చేసిన కామెంట్ ఆర్జీవీపైనే అని చెప్పుకుంటున్నారు జనం. రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నడుమ ఓ రేంజ్లో యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎవ్వరినీ కించపర్చడం లేదంటూనే ఎన్నికల తర్వాత కథ అంటూ ‘పవర్ స్టార్’ సినిమా ప్రారంభించి వివాదానికి బీజం వేశారు వర్మ. అంతటితో ఆగక పలు వివాదాస్పద పోస్టర్స్ రిలీజ్ చేసి సంచలనం సృష్టించడంతో పవన్ ఫ్యాన్స్కి వర్మ ని చంపేద్దామన్నంత కోపం వుంది. దీంతో వివాదం ముదిరి వర్మ ఆఫీసుపై దాడి చేశారు పవన్ అభిమానులు. అయినప్పటికీ తన ‘పవర్ స్టార్’ సినిమా విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటూ స్టేట్మెంట్స్ ఇచ్చేశారు వర్మ. సరిగ్గా ఈ పరిస్థితుల్లో మెగా ఫ్యామిలీ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ఓ పోస్ట్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
”కేవలం పనికొచ్చే వార్తలు మాత్రమే వింటా” అని పేర్కొంటూ ‘రంగస్థలం’ సినిమాలోని తన స్టిల్ షేర్ చేశారు రామ్ చరణ్. దీంతో ఈ పిక్ క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పోస్ట్ చూసి.. రామ్ గోపాల్ వర్మ పనికిరాని మాటలు చెబుతున్నారని, ఆయన పైనే చెర్రీ ఈ కౌంటర్ వేశారనే అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు జనం. మరోవైపు రామ్ చరణ్ వేసిన పంచ్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తూ ఖుషీ అవుతున్నారు పవన్ ఫ్యాన్స్. వర్మ రూపొందించిన ‘పవర్ స్టార్’ మూవీ ఈ రోజు (జులై 25) ఉదయం 11 గంటలకు విడుదలైంది. అయితే ఈ సినిమాకు పోటీగా పవన్ ఫ్యాన్స్ ‘పరాన్నజీవి’ పేరుతో మరో సినిమాను రిలీజ్ చేస్తుండటం విశేషం. నూతన్ నాయుడు దర్శకత్వంలో రూపొందిన ‘పరాన్నజీవి’ సినిమా వర్మలో మార్పు తీసుకొస్తుందని, ముల్లును ముల్లుతోనే తీయాలని ఆలోచించి ఈ సినిమా తీశామని అంటున్నారు పవన్ ఫ్యాన్స్. సో.. చూడాలి మరి ఈ రెండు సినిమాలు ఇంకెన్ని వివాదాలకు స్వాగతం పలుకనున్నాయో!.













