మ్యూజిక్ డైరెక్టర్స్ కోటి, కీరవాణి, మణిశర్మల సంగీత గురువు కె ఎస్ చంద్ర శేఖర్ కరొనా తో మృతి

ప్రముఖ అల్ ఇండియా రేడియో సంగీత దర్శకులు, సినీ సంగీత దర్శకులు కె ఎస్ చంద్ర శేఖర్ కరొనా తో మరణించారు …. వీరి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామము … వీరికి భార్య ముగ్గురు కుమార్తెలు … 1990 లో అల్ ఇండియా రేడియోలో గ్రేడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేరి విశాఖపట్నం వాసులకు సుపరిచితులయ్యారు. అల్లురామలింగయ్య గారి చిత్రం ‘బంట్రోతు భార్య’ తో నేపథ్యగాయకునిగా సినీరంగ ప్రవేశం చేసిన ఈయన సంగీత దర్శకులు చక్రవర్తి గారివద్ద 70 కి పైగా చిత్రాలకు చీఫ్ అసోసియేట్ గా చేసారు. తదుపరి రమేష్ నాయుడు వద్ద 40 చిత్రాలకు, హిందీలో లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వద్ద సహాయకునిగా పనిచేసి గీతఆర్ట్స్ బ్యానర్ పై అరవింద్ గారు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నిర్మించిన ‘యమకింకరుడు’ చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం అయ్యారు.
ఆ కోవలో బ్రహ్మముడి (రజని తొలిచిత్రం), భానుచందర్ ‘హంతకుడి వేట’ రాజేంద్ర ప్రసాద్ ‘ఆణిముత్యం’ కోడి రామకృష్ణ గారి ‘ఉదయం’ మరియు ‘అదిగో అల్లదిగో’ దాసరి గారి భోళాశంకరుడు, ఆత్మ బంధువులు, కంచి కామాక్షి (తమిళ్ & హిందీ) ఇలా దాదాపు 30 కి పైగా చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చారు. తదనంతరం విశాఖపట్నం అల్ ఇండియా రేడియో గ్రేడ్ 1 మ్యూజిక్ డైరెక్టర్ గా సేవలందిస్తూ ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. ఘంటసాల గారు తిరుపతిలో ఈయన ప్రదర్శన చూసి తన హార్మోనియం బహుమతిగా ఇస్తే అది ఎంతో భద్రంగా అపురూపంగా చూసుకుంటూ ఇంటికి వచ్చిన అతిధులకు దానినే ముందుగా చూపించేవారు. కీరవాణి గారు కోటి గారు మణిశర్మ గారు ఆయన దగ్గర శిష్యరికం చేసారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన తరువాత కూడా తానొక వెటర్నటీ డాక్టర్ అయినా తనకిష్టమైన రంగంలో పి హెచ్ డి ని పూర్తి చేసిన నిత్య విద్యార్థి…తన జీవితంలో దాసరి గారి చిత్రాలకు ఎక్కువగా పనిచేసారు. ఆయన మరణ వార్తను సినీ రంగంలో కొనసాగుతున్న వారి మేనల్లుడు మహేంద్ర చిత్రపరిశ్రమకు మీడియా కు తెలియజేసారు.