గోరటి వెంకన్న, అశోక్తేజకు జాలాది పురస్కారాలు
సినీ రచయిత జాలాది జయంతి పురస్కరించుకుని జాలాది జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం-2017 విశాఖలోని వుడా బాలల థియేటర్లో ఘనంగా జరిగింది. జాలాది 86వ జయంతి సందర్భంగా ప్రజాకవి, గాయకుడు గోరటి వెంకన్నకు జాలాది జీవనకాల సాఫల్య పురస్కారం, సినీగేయ రచయిత సుద్దాల అశోక్తేజకు జాలాది జాతీయ పురస్కారం మంత్రి గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సుద్దాల అశోక్తేజ మాట్లాడుతూ తనకు జీవితాన్ని ఇచ్చింది జాలాదేనని పేర్కొన్నారు. పాటల రచయితగా ఎదిగేందుకు ఆయనే స్ఫూర్తి అని అన్నారు. గోరటి వెంకన్న మాట్లాడుతూ జాలాది రచనల్లోని డిక్షన్ ఎవరికీ అందనిదన్నారు. ఈ కార్యక్రమంలో సినీ, బుల్లితెర నటుటు, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్బాబు, వంగలపూడి అనిత, జాలాది ట్రస్టు ప్రతినిధులు పాల్గొన్నారు.













