అప్పుడు వ్యతిరేకించినవాళ్లే ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు
డిగ్రీ కాలేజ్ విడుదలకు ముందు పోస్టర్స్ చూసి సినిమాని ప్రదర్శించకుండా అడ్డుకుంటామన్న విద్యార్థి సంఘాలు, మహిళా సంఘల నాయకులే చిత్రాన్ని చూశాక మనసుకు హత్తుకునే మంచి కథ ఉందని ప్రశంసిస్తున్నారు. అప్పుడు వ్యతిరేకించినవాళ్లే ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు అన్నారు దర్శకుడు నరసింహ నంది. వరుణ్, దివ్వారావు జంటగా స్వీయ దర్శకత్వంలో నరసింహ నంది నిర్మించిన డిగ్రీ కాలేజ్ ఈ నె 7న విడుదలైంది. ఈ చిత్రం సక్సెస్ మీట్లో నరసింహ నంది మాట్లాడుతూ కొన్ని రొమాంటిక్ సీన్స్ చూసి సినిమా మీద నెగటివ్ అభిప్రాయం ఏర్పరచుకోవద్దని మా మనవి. సినిమా చూశాక మాట్లాడమని కోరుతున్నాం. బలమైన కథ ఉంది. క్లైమాక్స్ సీన్స్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. కుల వ్యవస్థ మీద తీసిన సినిమా ఇది. 1940 లో ఒక గ్రామం సినిమాని కుల వ్యవస్థపైనే తీశాను. జాతీయ అవార్డు వచ్చింది కానీ డబ్బు రాలేదు. డిగ్రీ కాలేజ్ కి డబ్బు కూడా రావడం ఆనందంగా ఉంది అన్నారు.













