హ్యాట్రిక్ హిట్స్ తర్వాత అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి మరో సినిమా అనౌన్స్
అరంగేట్రంతోనే తెలుగు సినిమా పరిశ్రమను తనవైపుకు తిప్పుకున్న దర్శక, నిర్మాత సాయి రాజేశ్. అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై అతని స్వీయదర్శకత్వంలో రూపొందిన హృదయ కాలేయం చిత్రం సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన కొబ్బరిమట్ట కమర్షియల్ గా సూపర్ హిట్ అనిపించుకుంది. మూడో సినిమాగా సందీప్ రాజ్ దర్శకత్వంలో ఈ బ్యానర్ లో నిర్మితమైన కలర్ ఫోటో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాదు.. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా జాతీయ పురస్కారాన్ని కూడా అందుకుంది. అలా వరుసగా మూడు హిట్స్ తో హ్యాట్రిక్ కొట్టిన అమృతా ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి నాలుగో సినిమా అనౌన్స్ అయింది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ తర్వాత ఈ బ్యానర్ నుంచి నాలుగో సినిమాకు సుమన్ పాతూరి దర్శకుడు. గతంలో ఇంకోసారి అనే చిత్రంతో ఉత్తమ నూతన దర్శకుడుగా నంది అవార్డ్ అందుకున్నాడు సుమన్ పాతూరి. ఆయన బర్త్ డే సందర్భంగా ఈ బ్యానర్ నుంచి ప్రొడక్షన్ నంబర్ 4న ప్రకటించారు. ప్రొడ్యూసర్ గా టాక్సీవాలాతో విజయాన్ని అందుకుని ప్రస్తుతం బేబీ చిత్రాన్ని నిర్మిస్తోన్న అభిరుచి కలిగిన నిర్మాత ఎస్కేఎన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీ కాస్టింగ్ కు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేయబోతున్నారు.













