అక్టోబరు 14 తెలంగాణకు బ్లాక్ డే
అక్టోబరు 14 తెలంగాణకు బ్లాక్ డేగా నిలిచిపోతుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. ఈ సందర్భగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వరని ఆరోపించారు. కేసీఆర్ ఓంటెద్దు పోకడలు తెలంగాణకు నష్టం చేస్తున్నాయన్నారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకే కొత్త ప్రాజెక్టుల ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ద్రోహిగా కేసీఆర్ నిలిచిపోతారన్నారు. కేఆర్ఎంబీ పాపం కేసీఆర్కు ఊరికేపోదని అన్నారు.
రాష్ట్ర పరిధిలో ఉన్న నీటి వ్యవహారాలపై కేంద్రం ఎందుకు అజమాయిషీ చేస్తుందని మండిపడ్డారు. నీటిపై పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తున్న కేంద్రానిది, అందుకు అవకాశం ఇస్తున్న రాష్ట్రానికి రెండూ తప్పేనని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఒకేసారి జలయజ్ఞంలో భాగంగా 86 ప్రాజెక్టులు ప్రారంభించామని, కేసీఆర్ ఇప్పుడు వెలగబెట్టిందేముందని ప్రశ్నించారు. రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం వల్ల ఎంత లాభం జరుగుతుందో కేసీఆర్ చెప్పగలరా అని ప్రశ్నించారు.













