పవన్ కల్యాణ్కు కేటీఆర్ మైండ్ బ్లోయింగ్ రిప్లై!
తెలంగాణ రాజకీయాలు మరోసారి తీవ్రస్థాయిలో వేడెక్కాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ప్రాంతీయవాదం, దేశభక్తి, తెలంగాణ అస్తిత్వంపై పవన్ లేవనెత్తిన ప్రశ్నలకు కేటీఆర్ తన శైలిలో విశ్లేషణాత్మక, కఠినమైన సమాధానాలిచ్చారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యల్లోని మీ అయ్య జాగీరా? అనే ప్రస్తావనను తీవ్రంగా తప్పుపట్టిన కేటీఆర్.. తెలంగాణ నేల భూమి పుత్రుల జాగీరేనని స్పష్టం చేశారు. “ఇది నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల సొత్తు. ఎందరో వీరుల త్యాగాలు, రక్తంతో తడిసిన నేల ఇది. ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలనేదే మా ఆకాంక్ష. గత పది, పన్నెండేళ్లలో ఇక్కడ ఉన్న ఆంధ్రులకు గానీ, వారి వ్యాపారాలకు గానీ ఎలాంటి చిన్న సమస్యా రాలేదు” అని కేటీఆర్ గుర్తుచేశారు. ఏపీ ఉపముఖ్యమంత్రిగా పవన్ను గౌరవిస్తామని, ఒక నటుడిగా అభిమానిస్తామని చెబుతూనే, “ఇంటికి వస్తే మర్యాదగా హైదరాబాదీ బిర్యానీ పెడతాం.. కానీ సచివాలయంలో కూర్చుని పెత్తనం చేస్తామంటే మాత్రం తెలంగాణ సమాజం అస్సలు ఒప్పుకోదు” అని తేల్చి చెప్పారు.
ప్రాంతీయవాదం అనేది ఉగ్రవాదం కంటే ప్రమాదకరమన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. మద్రాస్ ప్రావిన్స్ నుండి ఆంధ్ర రాష్ట్రం వేరుపడాలని పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు చేసిన నిరాహార దీక్షను కూడా పవన్ ప్రాంతీయవాదం అంటారా? అని ప్రశ్నించారు. జాతీయవాదం ముసుగులో జరుగుతున్న ఆర్థిక ప్రాంతీయవాదాన్ని కేటీఆర్ ఎండగట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రాంతంపై ఉన్న అభిమానంతో తెలంగాణకు రావలసిన పరిశ్రమలను గుజరాత్కు తరలించుకుపోతున్నారని, ప్రధాని కేవలం గుజరాత్కే ప్రధానిలా వ్యవహరించడం సరైనదేనా అని పవన్ను నిలదీశారు. దీనికి పవన్ కల్యాణ్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
భవిష్యత్తులో తెలంగాణలో ఎవరూ జనగణమన పాడరేమో అన్న పవన్ ఆందోళనను కేటీఆర్ కొట్టిపారేశారు. “దేశభక్తి గురించి మేము పవన్ కల్యాణ్ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేల నిజాం సర్కారుపై, అణిచివేతపై పోరాడిన గడ్డ. కమ్యూనిస్టులు కదంతొక్కిన గడ్డ” అని గుర్తుచేశారు. పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమాను ప్రస్తావించిన కేటీఆర్, “మాకు ఇక్కడ అసలైన తెలంగాణ OG కేసీఆర్ గారు ఉన్నారు. తెలంగాణను కాపాడుకోవడానికి ఆయన ఒక్కరు చాలు” అని వ్యాఖ్యానించారు.
రాజ్యాంగబద్ధంగా ఎవరైనా, ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉందని, గతంలో 2018లో చంద్రబాబు, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ఇక్కడ పోటీ చేశాయని కేటీఆర్ గుర్తు చేశారు. అప్పుడు అడ్డుకోనిది, ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు పవన్ సభ పెట్టాలనుకుంటే అడ్డుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఏమైనా అనాలనుకుంటే కాంగ్రెస్ను అనాలని సూచించారు. తల్లిని చంపి బిడ్డను బతికించారు లాంటి వ్యాఖ్యలు చేస్తూ, తెలంగాణ ఏర్పాటు విధానం నచ్చలేదనే నెపంతో అసలు విషయాలను పక్కదారి పట్టించవద్దని పవన్ కల్యాణ్కు కేటీఆర్ హితవు పలికారు. ఈ రకమైన రాజకీయ విమర్శలు తెలంగాణ ఆకాంక్షలను కించపరిచేలా ఉండకూడదని హెచ్చరించారు.








