ప్రవాస భారతీయులకు శుభవార్త.. ఇకపై ‘డిజిటల్ ఇ-OCI’ కార్డులతో సులభతర ప్రయాణం
e-OCI : ప్రవాస భారతీయులు (OCI కార్డుదారులు) , వారి కుటుంబ సభ్యుల కోసం భారత ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఇకపై భౌతిక OCI బుక్లెట్లతో పని లేకుండా, డిజిటల్ రూపంలో ‘ఇ-OCI’ కార్డులను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. పౌరసత్వ (సవరణ) నిబంధనలు 2026లో భాగంగా, హోం మంత్రి అమిత్ షా 30 జూన్ 2026న ఈ డిజిటల్ వ్యవస్థను అధికారికంగా ప్రారంభించారు.
ఇ-OCI అంటే ఏమిటి?
ఇ-OCI అనేది భౌతిక OCI కార్డుకు డిజిటల్ ప్రతిరూపం. దీనివల్ల భౌతిక పుస్తకాలను వెంట ఉంచుకోవాల్సిన అవసరం, అవి పోతాయనే ఆందోళనలు తొలగిపోతాయి. కొత్త దరఖాస్తుదారులకు ఇది ప్రాధాన్యత క్రమంలో లభిస్తుంది. ప్రస్తుత కార్డుదారులు దశలవారీగా ఈ డిజిటల్ వెర్షన్కు మారవచ్చు. అయితే, విమానయాన సంస్థల సిబ్బంది ఈ మార్పులకు పూర్తిగా అలవాటు పడే వరకు, ప్రయాణాల్లో భౌతిక కార్డును కూడా వెంట ఉంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్యమైన మార్పులు , ప్రయోజనాలు..
20 సంవత్సరాల వయస్సు దాటిన వారు కొత్త పాస్పోర్ట్ పొందినప్పుడు, ఇకపై భౌతిక బుక్లెట్ను తిరిగి జారీ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఆన్లైన్ పోర్టల్లో కొత్త పాస్పోర్ట్ వివరాలను అప్డేట్ చేస్తే సరిపోతుంది. పాత పద్ధతిలో 6-8 వారాలు పట్టే ప్రక్రియ, ఇప్పుడు 15 పనిదినాల్లోపు పూర్తవుతుంది. ఇ-OCI మొబైల్ ఫోన్లో ఎప్పుడైనా, ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది అత్యంత సురక్షితమైనది. డిసెంబర్ 2026 నాటికి, భారత విమానాశ్రయాల్లో ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా టచ్లెస్ ప్రవేశానికి ఈ కార్డును అనుసంధానించనున్నారు. బయోమెట్రిక్ వివరాల కోసం FRRO కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇ-OCI ద్వారా ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించారు.
దరఖాస్తు ప్రక్రియ..
ఇ-OCI కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు అధికారిక పోర్టల్ (OCIservices.gov.in) ద్వారా ఫారం XXVIIIని పూరించాలి. తాజా పాస్పోర్ట్, అధిక రిజల్యూషన్ కలిగిన బయోమెట్రిక్ ఫోటోలను అప్లోడ్ చేసి, రుసుము చెల్లించాలి. ఒకవేళ OCIని సరెండర్ చేయాలనుకుంటే, ప్రత్యేక పోర్టల్ ద్వారా ఫారం XXXIని పూరించి ఆన్లైన్లోనే ఆ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ డిజిటల్ మార్పుల వల్ల OCI దరఖాస్తుల సమర్పణలో ఉన్న సంక్లిష్టత తగ్గి, ప్రక్రియ మరింత సులభతరం అయ్యింది.








