వీక్షణం పంచమ వార్షికోత్సవం
వీక్షణం పంచమ వార్షికోత్సవం సెప్టెంబరు -10న కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ లోని స్వాగత్ హోటల్ లో ఘనంగా జరిగింది. ఉదయం 10 గం. నుండి సాయంత్రం 7 గంటల వరకు జరిగిన ఈ సమావేశం ఆద్యంతం అత్యంత రసవత్తరంగా జరిగింది. ఉదయం సభను ప్రారంభిస్తూ వీక్షణం సంస్థాపకురాలు డా||కె.గీత అయిదేళ్ల ప్రస్థానాన్ని తల్చుకుంటూ, అందరికీ ఆహ్వానం పలికారు. మొదటి సెషన్ కథ గురించిన అంశాలతో ప్రారంభమయ్యింది. ఈ సెషన్కు శ్రీ మధు బుడమగుంట అధ్యక్షత వహించారు. ఇందులో శ్రీ వేమూరి తన స్వీయ కథా ప్రస్థానాన్ని గురించి, శ్రీ వేణు ఆసూరి తనకు నచ్చిన కథల గురించి, శ్రీ చుక్కా శ్రీనివాస్ గార్లు దళిత ఉద్యమాల మధ్య నల్ల మిరియం చెట్టు అనే అంశం మీద ప్రసంగించారు. తరువాత డా||కె.గీత నాలుగవ సంపుటి సెలయేటి దివిటీ ఆవిష్కరరణ జరిగింది. పుస్తక పరిచయం శ్రీ వేణు ఆసూరి చేయగా, శ్రీ నాగరాజు రామస్వామి పుస్తకావిష్కరణ చేసారు. తరువాత జరిగిన వీక్షణం ప్రత్యేక సంచికల ఆవిష్కరణలో శ్రీ కిరణ్ ప్రభ, శ్రీ లెనిన్, శ్రీ పెద్దు సుభాష్లు పాల్గొన్నారు. మధ్యాహ్న విందుతో బాటూ శ్రోతల వీనుల విందుగా శ్రీ నాగ సాయిబాబా, శ్రీమతి ఉమా వేమూరి, చి|| ఈశా పాటలు పాడారు. భోజన విరామానంతరం మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ మధు యాస్కీ అనుకోకుండా సభకు ప్రత్యేక అతిధిగా విచ్చేసి తెలుగు పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. కోమటి జయరాం ఆయనను సభకు పరిచయం చేసారు. మధు యాష్కీ మాట్లాడుతూ తెలుగు వాడిగా తనకు భాషాసాహిత్యాభిలాష ఉందని, అందుకు దోహద పడే తెలుగు రచయిత బర్కిలీ యూనివర్శిటీ తెలుగు వంటి ఉత్తమ కార్యక్రమాలకు చేయూతనిస్తానని హామా ఇచ్చారు. కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన సాహితీ క్విజ్ అందరినీ అమితంగా అలరించింది. తరువాత జరిగిన కవితా సమ్మేళనం యువకవి శశి ఇంగువ, నాగరాజు రామస్వామి కె.గీత, నాగ సాయిబాబా, సుభాష్ మున్నగు వారు పాల్గొన్నారు.
ఇక ఈ సభలో సంస్కృతాంధ్ర భాషా ద్విగుణీకృత అవధానం మొట్టమొదటి సారిగా జరిగిన చరిత్ర సృష్టించింది. ఇందులో సంస్కృతంలోనూ, తెలుగులోనూ కలిపి మొత్తం 16 మంది పృచ్ఛకులు పాల్గొన్నారు. అమెరికా పౌరులైన తెలుగు అవధాని పాలడుగు శ్రీచరణ్ గారి రెండవ అవధానమిది. ఇందులో అధ్యక్షులుగా రావు తాల్లాప్రగడ, సంస్కృత భాషకు పృచ్ఛకులుగా మారేపల్లి నాగవెంకటశాస్త్రి, విశ్వాస్ వాసుకి, పిల్లలమర్రి కృష్ణకుమార్, సంధ్యా వాలేకర్,మాజేటి సుమలత, హరినారాయణ పాల్గొన్నారు. తెలుగు భాషా పృఛ్చకులుగా పుల్లెల శ్యాంసుందర్, హరి కృష్ణమూర్తి, మహమ్మద్ ఇక్బాల్, కొండూరు రవిభూషన్ శర్మ, రెంటచింతల చంద్ర వేణు ఆసూరి, డా||కె.గీత పాల్గొన్నారు. వీక్షణం, మహాంద్ర భారతి కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఈ అవధానం దాదాపు నాలుగు గంటల సేపు కొనసాగింది. ఈ సభలో స్థానిక ప్రముఖులు, సాహిత్యాభిమానులు విశేషంగా పాల్గొన్నారు.













