MATA: ఘనంగా ‘మాటా’ రెండో మహాసభ కిక్ఆఫ్ కార్యక్రమం
అమెరికా తెలుగు సంఘాల చరిత్రలో మరో విశిష్ట ఘట్టాన్ని ఆవిష్కరిస్తూ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) రెండో మహాసభ 2026 కిక్ఆఫ్ వేడుకను ఘనంగా నిర్వహించింది. వచ్చే ఏడాది జూన్ 19,20 తేదీలలో పెన్సిల్వేనియా రాష్ట్రంలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్ లో ఈ మహాసభ జరగనుంది. ఈ సందర్బంగా రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్, ఫోర్డ్స్, న్యూ జెర్సీలో జరిగిన ఈ కిక్ఆఫ్ కార్యక్రమంలో అమెరికాలో ఉన్న తెలుగు కమ్యూనిటీ ప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కిక్ఆఫ్ కార్యక్రమంలోనే 1.4 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 12 కోట్లు) విరాళాలు, స్పాన్సర్షిప్ హామీలు లభించాయి. ఇది ‘మాటా’ పట్ల తెలుగు కమ్యూనిటీలో ఉన్న విశ్వాసం, నిబద్ధతను తెలియజేస్తోందని ‘మాటా’ ప్రతినిధులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాటా మహాసభ 2026 ప్రచార వీడియో, అధికారిక వెబ్సైట్ను ఆవిష్కరించారు. తెలుగు గౌరవాన్ని ప్రతిబింబించిన ఈ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకోగా, వెబ్సైట్ ద్వారా దేశవ్యాప్తంగా తెలుగు సమాజాన్ని డిజిటల్గా కలుపుతూ కొత్త యుగానికి నాంది పలికింది. మాటా నాయకత్వం 2026 మహాసభకు ప్రధాన, కార్యవర్గ బృందం పేర్లను అధికారికంగా ప్రకటించింది. మాటా వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల ఈ బృందాన్ని పరిచయం చేస్తూ, వారి నిబద్ధతను కొనియాడారు.
ఈ కార్యక్రమం సేవ, సంస్కృతి, సమానత్వం అనే ‘మాటా’ విలువలను ప్రతిబింబించింది. తెలుగు ఐక్యత, సంస్కృతి, గౌరవం ప్రతిధ్వనించిన ఉత్సాహం, ఆనందం, ఆధ్యాత్మికతతో కనిపించింది. ఆట పాటలు, నృత్య ప్రదర్శనలతో ఈ వేడుక కన్నుల పండగగా సాగింది. ప్రముఖ కళాకారుల ప్రదర్శనలు తెలుగు కళా సంపదను ప్రతిబింబించాయి. మాటా అధ్యక్షుడు రమణ కృష్ణ కిరణ్ దుద్దాగి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. న్యూ జెర్సీ, ఫిలడెల్ఫియా, న్యూ యార్క్, వర్జీనియా, హారిస్బర్గ్ శాఖల ప్రతినిధులతో పాటు దేశంలోని అన్ని శాఖలు తమ సహకారం అందించాయి. ఇది విస్తృత నెట్వర్క్ బలాన్ని, తెలుగు సమాజ ఐక్యతను గుర్తు చేసింది. మాటా 2వ మహాసభ కిక్ఆఫ్ తెలుగు ఐక్యత, ఆత్మగౌరవం, సేవా భావానికి ప్రతీక అని మాటా ప్రతినిధులు ప్రకటించారు. ఈ కార్యక్రమం రాబోయే 2026లో జరగబోయే మహాసభ ఉత్తర అమెరికా తెలుగు సమాజ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుందని మాటా నాయకులు పేర్కొన్నారు.
మాటా అధ్యక్షుడు రమణ కృష్ణ కిరణ్ దుద్దాగి, కన్వీనర్ శ్రీధర్ గూడాల, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గూడూరు, జనరల్ సెక్రటరీ విజయ్ భాస్కర్ కలాల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేశ్ చిలకపాటి, కో-కన్వీనర్ టోనీ జన్ను, కో-కన్వీనర్ దాము గేదల, కో-ఆర్డినేటర్ గంగాధర్ వుప్పాల, కో-ఆర్డినేటర్ కళ్యాణి రెడ్డి బెల్లంకొండ, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మహేందర్ నరాల, స్పిరిట్యువల్, మెంబర్షిప్ డైరెక్టర్ శిరీషా గుండపునేని, ప్రొగ్రామ్స్, ఈవెంట్ డైరెక్టర్ స్వాతి అట్లూరి, హెల్త్ అండ్ వెల్నెస్ డైరెక్టర్ డా. సరస్వతి లక్కసాని, పబ్లిసిటీ, పీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ శ్రీపేరంబుదర్, స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ కజానా, అడిషనల్ సెక్రటరీ శ్రీధర్ పెంట్యాల, ఇండియా కో-ఆర్డినేటర్ డా. విజయ్ భాస్కర్ బోల్గం తదితరులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో ‘మాటా’ వ్యవస్థాపకులు, సలహా మండలి సభ్యులు, కార్యవర్గ సభ్యులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ప్రాంతీయ వైస్ ప్రెసిడెంట్స్, వాలంటీర్లు, వివిధ సంస్థల నాయకులు పాల్గొన్నారు.






