కాలిఫోర్నియా లాక్డౌన్..భారతీయుల ఇబ్బందులు
కరోనా వైరస్ ఇప్పుడు అమెరికా రాష్ట్రాలను వణకిస్తోంది. దాంతో రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించాల్సినంతటి పరిస్థితి తలెత్తుతోంది. కాలిఫోర్నియా రాష్ట్రం మొత్తం లాక్డౌన్ ప్రకటించారు. కరోనా వైరస్ దృష్ట్యా ఇళ్లకే పరిమితం కావాలని కాలిఫోర్నియా ప్రభుత్వం హెచ్చరించడంతో శాన్ఫ్రాన్సిస్కో, లాస్ఏంజిలెస్, శాన్జోస్ నగరాలు నిర్మానుష్యంగా మారాయి. భారతీయులు ఆధారపడే దుకాణాలు మూసి ఉండటంతో వేలాది మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరీ ఇబ్బందుల్లో ఉన్న వారి కుటుంబాలకు తోటి భారతీయులు తమ దగ్గర ఉన్న నిత్యావసరాల్లో కొన్నింటిని అంద జేస్తున్నారు.
ఈ పరిస్థితి మారడానికి భారతీయ దుకా ణాలను తెరిపించాలని, అక్కడ నిత్యావసర వస్తువులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సిలికాన్ వ్యాలీ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు కాలిఫోర్నియా గవర్నర్ను కోరారు. మరోవైపు అమెరికా అంతా లాక్డౌన్ విధించాలని, సెల్ఫ్ క్వారంటైన్ చేయాలని ఫెడరల్, రాష్ట్ర ప్రభుత్వాలను అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (ఏఏపీఐ) అభ్యర్థించింది. తెలుగువాడైన సురేషరెడ్డి అధ్యక్షుడిగా ఉన్న ఈ సంఘంలో లక్షమంది వైద్యులు సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వాల నిర్ణయాలను ప్రభావితం చేయగలదిగా ఏఏపీఐకి పేరుంది. అమెరికా సమాజంతో పాటు ఆరోగ్య, ఆర్థిక వ్యవస్థలపై కరోనా తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని సురేష్ పేర్కొన్నారు.













