ఘనంగా జరిగిన ‘బాటా’ విళంబి వేడుకలు

మిల్పిటాస్లో జరిగిన బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలకు 1500 మందికిపైగా హాజరయ్యారు. బే ఏరియా తెలుగు కమ్యూనిటీలో బాగా నిర్వహించే ఉగాది వేడుకలు ప్రత్యేకంగా ఉంటాయి. ఈసారి కూడా బాటా తనదైనరీతిలో ఈ వేడుకలను నిర్వహించి కమ్యూనిటీలో మరోమారు తన స్థానాన్ని నిలబెట్టుకుంది. డ్యాన్సింగ్, సింగింగ్, స్పెషల్ టాలెంట్ పోటీలతోపాటు విభిన్నమైన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో వచ్చినవారిని ఆకట్టుకుంది.
మై ట్యాక్స్ ఫైలర్ ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తే, యు స్మైల్ డెంటల్, పిఎన్జి జూవెల్లర్స్ గ్రాండ్ స్పాన్సర్లుగా వ్యవహరించాయి. స్పాన్సర్లుగా కాల్ హోమ్స్ – రమణారెడ్డి, పాఠశాల, అర్జున్ ట్యాక్స్, క్లాసిక్ డైమండ్స్, విఐపి ట్రావెల్స్, మంత్రి డెవలపర్స్, న్యూయార్క్ లైఫ్ ఉన్నాయి. రేడియో విరిజల్లు, బాలీ 92.3 ఎఫ్ఎం, తెలుగు టైమ్స్ మీడియా పార్టనర్లుగా వ్యవహరించాయి.
ఉగాది వాతావరణం తలపించేలా వేదికను అలంకరించారు. వేడుకలు జరిగే ఆవరణలో వివిధ వ్యాపార సంస్థలు తమ బూత్లను ఏర్పాటు చేశాయి. ఉగాది పచ్చడిని వచ్చినవారందరికీ అందజేశారు.
శాస్త్రీయ, జానపద ఆటల పాటల పోటీలకు మంచి స్పందన వచ్చింది. దాదాపు 300కు పైగా చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. సునీత పెండేకంటి, జయశర్మ, కీర్తి, చిన్మయి, ఆదిత్య, శిరీష బత్తుల, మానస కొల్లూరు, శ్రీకృష్ణన్, కృష్ణ రాయసం, జానకి ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. బాటా అడ్వయిజర్ విజయ ఆసూరి స్వాగత వచనాలతో ముఖ్య కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైంది. నిత్యానంద స్కూల్కు చెందిన స్టూడెంట్లు ఆనందభైరవి, కూచిపూడి శాస్త్రీయ నృత్యాలు, ఝాన్సీ గ్రూపుకు చెందిన విద్యార్థులు కొత్త బంగారులోకం పేరుతో టాలీవుడ్ డ్యాన్స్లను, ఏరో డ్యాన్స్ గ్రూపు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బాటా అడ్వయిజరీ మెంబర్ డా. రమేష్ కొండ అతిధులను వేదికపైకి ఆహ్వానించారు.
అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటిని, కాలిఫోర్నియా అసెంబ్లీ సభ్యుడు యాష్ కల్రా, మిల్పిటాస్ మేయర్ రిచ్ ట్రాన్, మిల్పిటాస్ అండ్ వైస్ మేయర్ మార్ష గ్రిల్లిని వేదికపైకి ఆహ్వానించారు. తెలుగు సంస్కృతికి బాటా చేస్తున్న సేవలను అతిధులు ప్రశంసించారు. బాటా కొత్త వెబ్సైట్ను యాష్ కల్రా ప్రారంభించారు. తెలుగు టైమ్స్ 15వ వార్షికోత్సవాన్ని కూడా ఈ వేడుకల్లోనే జరిపారు. పత్రిక ఎడిటర్ చెన్నూరి సుబ్బారావు కూడా అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
శ్రీరామజయరామ పేరుతో నృత్యరూపకాన్ని దాదాపు 100 మంది చిన్నారులు ప్రదర్శించారు. వేణు ఆసూరి దీనిని రూపొందించారు. విజయ, శ్రీలు, శ్రీదేవి, శిరీష, తారకదీప్తి దీనికి కొరియోగ్రఫీ అందించారు. బే ఏరియాలోని 5 లొకేషన్లలో ఉన్న చిన్నారులు ఇందులో పాల్గొన్నారు. ఈ నృత్యరూపకం అద్భుతంగా ఉందని పలువురు వ్యాఖ్యానించి, ఇందులో నటించిన చిన్నారులను అభినందించారు. మ్యూజికల్ కామెడి ప్రేమయుద్ధం నవ్వించింది. తెలుగు టైమ్స్, బాటా కలిసి నిర్వహిస్తున్న ‘పాఠశాల’ టీమ్ను ఈ సందర్భంగా అందరూ అభినందించారు. చిన్నారులకు తెలుగు భాషను నేర్పుతూ, పాఠశాల మాతృభాష పరిరక్షణకు కృషి చేస్తోందని అందరూ ప్రశంసించారు. కార్యక్రమాల్లో హైలైట్గా పల్నాటి భారతం పేరుతో ప్రదర్శించిన సాంఘిక నాటకం అందరినీ ఎంతగానో మైమరపింపజేసింది. రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు గ్రహీత, 500కుపైగా నాటకాలను వేసి మెప్పించిన డా. రవికుమార్ నరాలసెట్టి ఈ నాటకానికి రూపకల్పనతోపాటు దర్శకత్వం కూడా వహించారు. డా. రవి నరాలసెట్టి, సుబ్బారావు చెన్నూరి, ప్రసాద్ మంగిన, కళ్యాణ్ కట్టమూరి, చక్రపాణి, మాధవ్ దంతుర్తి ఇందులో నటించారు. బాటా వార్షిక సావనీర్ తెలుగు వెలుగును కూడా ఆవిష్కరించారు. చివరన బాటా ప్రెసిడెంట్ డా. శిరీష బత్తుల అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
కొత్త బాటా ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా ఈ వేడుకల్లోనే పరిచయం చేశారు. బాటా ప్రెసిడెంట్గా యశ్వంత్ కుదరవల్లి, వైస్ ప్రెసిడెంట్గా హరినాథ్ చికోటి, సెక్రటరీగా సుమంత్ పుసులూరి, ట్రెజరర్గా కొండల్రావు, జాయింట్ సెక్రటరీగా అరుణ్ రెడ్డిని పరిచయం చేశారు. స్టీరింగ్ కమిటీ సభ్యులుగా రవి తిరువీధుల, కామేష్ మల్ల, శిరీష బత్తుల, కల్చరల్ డైరెక్టర్లుగా శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తి, నామినేటెడ్ కమిటీ సభ్యులుగా ప్రశాంత్ చింత, వరుణ్ ముక్క, హరి సన్నిధి, బాటా అడ్వయిజరీ బోర్డ్ సభ్యులుగా జయరామ్ కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్ మంగిన, కళ్యాణ్ కట్టమూరి, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండ ఉన్నారు.