వరల్డ్ డేటా హబ్ గా ఇండియా…?
ఇండియా ప్రభ అంతర్జాతీయంగా వెలిగిపోతోంది. ఇటీవలి కాలంలో ఇండియా నాయకత్వపటిమను.. ప్రపంచం కూడా నమ్ముతోంది. అందుకే వివిధ రంగాల్లో దిగ్గజ కంపెనీలు ఏరికోరి మరీ ఇండియన్స్ ను సీఈవోలుగా పెట్టుకుని కంపెనీలను నడిపిస్తున్నాయి. అయితే వీటికి తోడు మరో రంగంలోనూ ఇండియా దూసుకెళ్తోంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో భారత్ దుమ్మురేపుతోంది. మరీ ముఖ్యంగా వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఆసియాలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న డేటా సెంటర్ మార్కెట్గా భారత్ అవతరిస్తోందని ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ సాక్స్ తన నివేదికలో వెల్లడించింది. దేశంలోని యువ జనాభా, అపారమైన ఇంజినీరింగ్ నైపుణ్యం కలిగిన మానవవనరులు, ప్రభుత్వ సానుకూల విధానాలు ఈ రంగానికి మరింత ఊతమిస్తున్నాయని వివరించింది.
దేశంలో ముంబై, చెన్నై నగరాలు డేటా సెంటర్లకు ప్రధాన గమ్యస్థానాలుగా మారాయి. సబ్మెరైన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు లభ్యత ఇందుకు ప్రధాన కారణం కాగా, ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు నగరాలు కొనసాగుతున్నాయి. వీటికి తోడు పశ్చిమాసియా దేశాలకు వ్యూహాత్మకంగా చేరువలో ఉండటం కూడా భారత్కు కలిసొచ్చే అంశమని నివేదిక పేర్కొంది.
ఈ రంగానికి సంబంధించిన తాజా గణాంకాలు కూడా ఇదే వృద్ధిని ధ్రువీకరిస్తున్నాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం, దేశంలోని డేటా సెంటర్ల సామర్థ్యం గత ఏడాది చివరి నాటికి 1.6 గిగావాట్లకు చేరుకుంది. ప్రస్తుతం మరో 0.32 గిగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు నిర్మాణ దశలో ఉండగా, 2.92 గిగావాట్ల సామర్థ్యం పనుల కోసం వివిధ సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయి.








