తానా – పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు
అమెరికా రాజధాని ప్రాంతంలోని వర్జీనియాలో తానా-పాఠశాల ఆధ్వర్యంలో ఫాదర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధులుగా టీటీడీ పాలక మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్ , తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన, మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తానా- పాఠశాల చైర్మన్ భాను మాగులూరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మల్లెల రాజశేఖర్ మాట్లాడుతూ తండ్రి అంటే కేవలం ఒక వ్యక్తి కాదు. ఒక కుటుంబానికి బలమైన ఆధారం, మార్గదర్శి, రక్షకుడని ఆయన తెలిపారు. ఎన్నారైలకు, వారి కుటుంబ సభ్యులకు వంద టిక్కెట్లు జారే చేస్తున్నామన్నారు. అలాగే అమెరికాలోని ఆరు నగరాలలో శ్రీనివాస కళ్యాణం జరిపించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన మాట్లాడుతూ జీవితంలో ప్రతి అడుగులోనూ మనకు ధైర్యం, క్రమశిక్షణ, బాధ్యత మరియు విలువలను నేర్పించే మొదటి గురువు తండ్రేనని ఆయన అభివర్ణించారు. అందుకే తండ్రిని గౌరవించడం, ప్రేమించడం మరియు ఆయన చేసిన త్యాగాలను గుర్తుంచుకోవడం మన బాధ్యత అని తెలియజేశారు. మన మాతృబాష తెలుగును సమిష్టిగా పరిరక్షించుకుందామన్నారు.
మిర్చియార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ తల్లి ప్రేమను వ్యక్తపరుస్తే, తండ్రి ప్రేమను తన కష్టాల ద్వారా చూపిస్తాడు. కుటుంబం సంతోషంగా ఉండాలని తన సుఖాలను త్యాగం చేస్తూ, పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించే మహానుభావుడు తండ్రి అని తెలియజేశారు. మన విజయాల వెనుక తండ్రి కష్టం, త్యాగం మరియు ఆశీర్వాదం దాగి ఉంటాయన్నారు. మనం ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కనే మొదటి వ్యక్తి కూడా తండ్రేనన్నారు.
భాను మాగులూరి మాట్లాడుతూ ఫాదర్స్ డే కార్యక్రమం సందర్భంగా హాజరైన తల్లి తండ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ.. మాతృభూమి, మాతృబాష రెండుకళ్లుగా భావించే ప్రవాస భారతీయులందరి జీవితాలలో తండ్రిది అగ్రస్థానం. నాన్న ఉన్నాడనే ధైర్యం, ఉంటారనే నమ్మకం మనల్ని నడిపిస్తుంది. నాన్న మనల్ని భుజం తట్టి గుండెకు హత్తుకుని చెప్పే అనుభవాలు జీవితకాల పాఠాలని, ఎన్నటికీ వదలని చేయి నాన్న అని తెలిపారు.
ముందుగా, సరస్వతి దేవి చిత్రపటానికి పూల మాల వేసి, అనంతరం కేక్ కట్ చేశారు. తానా కార్యవర్గ సభ్యులు అనిల్ ఉప్పలపాటి, సాయి బొల్లినేని, సుధీర్ కొమ్మి అతిధులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో GWTCS అధ్యక్షులు రవి అడుసుమిల్లి, ఉపాధ్యక్షులు సుశాంత్ మన్నే, ప్రవాస పెద్దలు సీతారామారావు ఎండూరు , రమేష్ అవిర్నేని, చంద్రనాధ్ నంబూరు, శంకర్రావు పొన్నం, పూర్ణచంద్రరావు అన్నం, వెంకటరెడ్డి గోలి, సుబ్బారెడ్డి జొన్నల, వీరభద్రరావు వల్లభనేని, సురేష్ దొంతుల , సురేష్ లగిశెట్టి, యోగానంద్ వంకిన, గంగారావు పొనగోటి , సుదర్శన్ అమరవాది, భాస్కరరావు చీటి, సత్తయ్య మారిశెట్టి, ప్రభులింగం బచ్చు తదితరులు పాల్గొన్నారు.










