తెలంగాణ దేశంలోనే నంబర్వన్ రాష్ట్రం
ఆర్థిక వృద్ధిరేటులో తెలంగాణ దేశంలోనే నంబర్వన్ రాష్ట్రంగా ఎదిగిందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని దిగువ మానేరు జలాశయం పరిధిలోని ఉజ్వల పార్క్ వద్ద రూ.25 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఐటీ టవర్ నిర్మాణానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తోందని అన్నారు. ఐటీ రంగంలో మూడేళ్లలోనే లక్ష వరకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు వచ్చాయన్నారు. రాష్ట్ర యువతకు పని చేసే చోటే ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.56 వేల కోట్ల ఐటీ ఎగుమతులు ఉన్నాయని గుర్తు చేశారు. గతేడాది ఐటీ ఎగుమతులు రూ.87 వేల కోట్లకు చేరాయని తెలిపారు. ఐటీ రంగంలోనే వేలాది సంఖ్యలో ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పారు. తెలంగాణ యువతకు ఐటీలో శిక్షణ ఇచ్చేందుకు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ఐటీ టవర్లను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. కరీంనగర్లో ఇప్పుడు నిర్మిస్తున్న టవర్తో పాటు త్వరలోనే రెండో టవర్ ఏర్పాటుకు అనుమతులు ఇస్తామని ప్రకటించారు. ఐటీ కంపెనీలను విస్తరిస్తామని సృస్టం చేశారు.













