ఏపీలో మరో 845 కరోనా కేసులు
ఆంధప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 14,285 మంది నమూనాలు పరీక్షించగా 845 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలకు చెందిన నాలుగు, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 29 కేసులు ఉండగా.. రాష్ట్రంలో 812 పాజిటివ్ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 16,907 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా గడచిన 24 గంటల్లో కృష్ణా, శ్రీకాకుళం, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 198 చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 7313కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 8586 మంది చికిత్స పొందుతున్నారు.






