ఏపీలో 100 దాటిన కరోనా మరణాలు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 22,371 మంది నమూనాలు పరీక్షించగా 491 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్తో తెలిపింది. వీటిలో రాష్ట్రానికి చెందినవారు 390 మంది కాగా, విదేశాల నుంచి వచ్చినవారు 18 మంది, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు 83 మంది ఉన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,452 కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 101కి చేరింది. ఇందులో ఐదుగురు ఈ రోజే చనిపోయారు. ఇప్పటివరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 4,111కి చేరింది. గత 24 గంటల్లో 138 మంది కోలుకున్నారు. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 4,240 మంది చికిత్స పొందుతున్నారు.






