TANTEX: “నెల నెలా తెలుగువెన్నెల”, తెలుగు సాహిత్య వేదిక 18వ వార్షికోత్సవము

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం, టాంటెక్స్ (TANTEX) ”నెల నెలా తెలుగువెన్నెల”, తెలుగు సాహిత్య వేదిక 18వ వార్షికోత్సవము 2025 జూలై నెల 19 వ తేదీ న డాలస్ (Dallas) పురము నందు ఘనంగా నిర్వహించబడింది. ఇన్నోవేషన్ హబ్ సమావేశ మందిరము వేదికగా సాహితీ సదస్సు సంగీత సాహిత్య నృత్య సమేళనం గా కన్నుల పండువగా జరిగింది.
తొలుత చిరంజీవి సమన్విత మాడా వీనుల విందుగా ఆలపించిన త్యాగరాజ కీర్తన ‘మనవ్యాలకించరాదటే’ ప్రార్ధన గీతంతో సదస్సును ప్రారంభించడం జరిగింది. తరువాత ప్రముఖ కవి కీ శే వడ్డేపల్లి కృష్ణ వ్రాసిన సంస్థ ప్రత్యేక గీతం ”నెల నెలా -తెలుగు వెన్నెలా ”ని ప్రముఖ గాయని శివాత్మిక ఆలపించారు. సంస్థ సమన్వయ కర్త దయాకర్ మాడా స్వాగత వచనాలు పలుకుతూ సాహిత్య వేదిక గత 18 ఏళ్ళుగా క్రమం తప్పకుండా ప్రతి 3 వ ఆదివారం సాహిత్య కార్యక్రమాలని నిర్వహిస్తుందని, ఇందులో భాగంగా, తెలుగు భాషా సాహిత్యాలని సుసంపన్నం చేసిన ఎందరో మహామహులు ఈ వేదికని అలంకరించారని, అలాగే ఎన్నో సాహిత్య ప్రక్రియల ప్రదర్శన జరిగిందని తెలియజేసారు. గత రెండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమ నిర్వహణ తనకెంతో తృప్తి నివ్వడమే కాక, ఎంతో మంది సాహితీ ఉద్దండులతో సాన్నిహిత్యాని కలిగించిందని పేర్కొన్నారు. ఈ రోజు కార్యక్రమాలు కడుపుకింపైన విందు భోజనాలతో పాటు, కనులకు, చెవులకు, మనసుకు ఇంపుగా సంగీత, సాహిత్య, నృత్య సమ్మేళనంగా రూపొందించడం జరిగిందని, ఆసాంతం ఉండి అన్నీ అస్వాదించాలని ఆహుతులని కోరారు.
తరువాత శ్రీ దయాకర్ మాడా ముఖ్య అతిథి సంస్కృతాంధ్ర ద్విశతావధాని పాలడుగు శ్రీచరణ్ గారిని సాహితీ ప్రియులకు పరిచయం చేశారు. సాఫ్ట్వేర్ రంగం లో ఉద్యోగం చేస్తూ గత మూడు దశాబ్దాలుగా అమెరికాలో నివాసం ఉంటున్న వీరు, ఇప్పటిదాకా 36 అష్టావధానాలు, 2 శతావధానాలు, ఒక ద్విశతావధానము చేసారు. ఈ రోజు విశిష్టమయిన సంస్కృతాంధ్ర ఏకాదశావధానం చేయబోతున్నారు. కార్యక్రమానికి సంధాతగా తొలి తెలుగు అమెరికా అవధాని ఆచార్య పుదూరు జగదీశ్వరన్ గారు వ్యవహరించి అవధాన ప్రక్రియ ని సభకు పరిచయం చేసి కార్యక్రమం ఆరంభించారు. అటు సంస్కృతం, ఇటు తెలుగు పూరణలతో, సమయోచిత సందర్భ సహిత వివరణలతో, చతురోక్తులతో ఆద్యంతం అవధాని గారు ఆహుతులను అలరించారు.
పృచ్చకులుగా నిషిద్ధాక్షరి- జంద్యాల జయకృష్ణ బాపూజీ,సమస్య- ఉపద్రష్ట సత్యం, దత్తపది-చంద్రహాస్ మద్దుకూరి, వర్ణన-డా. గుర్రం మైథిలి, న్యస్తాక్షరి -సిద్దా శ్రీధర్, అప్రస్తుత ప్రసంగము-మాడా దయాకర్, పురాణము-వేముల లెనిన్, ఆశువు-పాలూరి సుజన, సంస్కృతము దత్తపది-నేమాని రాజశేఖర్,సమస్య-పేరి భార్గవి,వర్ణన-రామడుగు నరసింహాచార్యులు వ్యవహరించారు.’కృత్స్న జ్యోత్స్నల వీడి చెప్పగదవే హృత్స్నేహమేపారగన్’ అంటూ క్లిష్టమైన ప్రాసలతో కూడిన సమస్యను వారు పూరించిన తీరు, ‘రసాభాసోజాతః కవికులగురోః కావ్యనిచయే’ సంస్కృత సమస్యా పూరణము ఆహుతులను అబ్బురపరచాయి. అవధానానంతరము సభికుల కరతాళ ద్వనుల మధ్య సంస్థ అవధాని గారిని ఘనంగా సత్కరించింది. అలాగే సిరికోన సంస్థ ప్రత్యేక పండిత పురస్కార ప్రధానము చేసింది.అడుగడునా అవధానాన్ని అక్షరీకరించిన వారు రమణ దొడ్ల, గౌతం కస్తూరి గార్లు.
విశిష్ట అతిథులుగా విచ్చేసిన ద్రావిడ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు కేంద్ర సాహిత్య అనువాద పురస్కారం పొందిన పర్వ నవలానువాద అనుభూతులను పంచుకుంటూ ‘అనువాద పర్వం’ పై ప్రసంగించారు. తరువాత హైదరాబాద్ విశ్వవిద్యాలయం లోని అనువర్తిత భాషాశాస్త్రం మరియు అనువాద అధ్యయనాల కేంద్రానికి నిర్దేశకుడిగా పదవీ విరమణ చేసిన ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు గారు ‘యంత్రానువాద వ్యవస్థల’ పై సోదాహరణముగా ప్రసంగం గావించారు. ఈ ఇరువురి ప్రధాన ప్రసంగాలు ఆహుతులని చాలా అలరించాయి. భాషకి సంబంధించిన కొత్త కోణాలని పరిచయం చేసాయి.
చివరగా కాలార్చన డాక్టర్ రాళ్ల బండి కవిత ప్రసాద్ గారి అద్భుత రచన తో సాగే శాస్త్రీయ నృత్య రూపకం. దేవి భాగవతంలో కాలతత్వము వివరించబడియున్నది. దాన్ని ఆధారంగా చేసుకుని కాలాన్ని నృత్య రూపక కథానాయకుడుగా తీర్చిదిద్దమైనది. ముందుగా మణిద్వీపంలో కొలువైయున్న శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారిని త్రిమూర్తులు త్రిమాతలు దేవతలు దర్శించి ఆమె ఆశీస్సులు పొందిన తర్వాత జగన్మాత కాలప్రస్తావని చేస్తుంది. అప్పుడు త్రిమూర్తులు కాలం యొక్క విశిష్టతను తెలియజేయమని అమ్మవారిని కోరుతారు. . అమ్మవారు కాల పురుషున్ని ఆవాహన చేసి కాలం గురించి తెలియజేస్తుంది. తదుపరి క్రమంలో పంచభూతాల విశిష్టత తెలియజేస్తూ ఆ పంచభూతాలు కాలపురుషునితో అంటే కాలంతో ఎట్ల మమైక్యమైనవో నిశ్చరూపకంలో చూపించబడుతుంది. తరువాత మేష వృషభది 12 రాశులు, ఆరు రుతువులు కాల పురుషునితో ఏ విధముగా సంచరించుచున్నాయో అద్భుతంగా అందంగా వివరించబడుతుంది. విశిష్టమైన సాహిత్యంతో శ్రవ్యమైన సంగీతంతో 40 మంది నర్తకి నర్తకులతో కనుల పండుగగా ఈ నృత్య రూపకాన్ని కళా రత్న కెవి సత్యనారాయణ నృత్య దర్శకత్వంలో ప్రదర్శించడమైనది. డాలస్ నగరంలోని ప్రముఖ నృత్య సంస్థల నుండి నాట్య గురువులు, నాట్య కళాకారులు ఈ నృత్య రూపకంలో పాత్రను పోషించారు.
తరువాత ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ సంస్థ కార్యవర్గ బృందము మరియు పాలక మండలి, సంస్థ తరపున అతిథులందరికీ సన్మాన పత్ర జ్ఞాపికలు శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగింది.
ఛివరగా వందన సమర్పణ గావించిన సంస్థ ప్రస్తుత అధ్యక్షులు చంద్రశేఖర్ పొట్టిపాటి కార్యక్రమం విజయవంతం చేయడంలో సహకరిచిన సంస్థ కార్యవర్గ బృందానికి,పాలక మండలికి, పూర్వాధ్యక్షులకూ సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా తోడ్పడుతున్న దాతలకూ ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేశారు. సభా వేదికను ఇచ్చి సహకరించిన విజయ్ బొర్ర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ చేశారు.
ఈ కార్యక్రమములో సంస్థ ఉత్తరాధ్యక్షులు మాధవి లోకిరెడ్డి,పాలక మండలి అధిపతి డా కొండా తిరుమల్ రెడ్డి, సభ్యులు డా శ్రీనాథ్ రెడ్డి పల్వల, సురేష్ మండువ, జ్యోతి వనం, కార్యవర్గ బృందం ఉదయ్ నిడిగంటి, దీప్తి సూర్యదేవర, సునీల్ సూరపరాజు, నరసింహ పోపూరి, శివారెడ్డి వల్లూరు, లెనిన్ తుళ్ళూరి సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, శ్రీ సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, డాక్టర్ నరసింహ రెడ్డి ఊరిమిండి, చిన్న సత్యం వీర్నాపు, చంద్ర కన్నెగంటి మరియు ప్రముఖ రచయితలు వంగూరి చిట్టెం రాజు, అత్తలూరి విజయలక్ష్మి గార్లు పాల్గొన్నారు.