భారత సంతతి ఇంజినీర్ కు టెక్సాస్ అత్యున్నత అకడమిక్ అవార్డు
భారత సంతతికి చెందిన ప్రముఖ కంప్యూటర్ ఇంజినీర్, ప్రొఫెసర్ అశోక్ వీరరాఘవన్కు టెక్సాస్ అత్యున్నత అకడమిక్ ఎడిత్ అండ్ పీటర్ ఓడన్నెల్ పురస్కారం దక్కింది. టెక్సాస్ అకాడమీ ఆఫ్ మెడిసిన్, ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ అవార్డును బహుకరిస్తుంది. ఆ రాష్ట్రంలో ఆయా రంగాల్లో ప్రతిభ చూపుతున్న ఔత్సాహిక పరిశోధకులకు ఈ సత్కారాన్ని అందజేస్తుంటారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ విభాగంలో చేసిన కృషికిగానూ వీరరాఘవన్కు ఈ పురస్కారాన్ని ప్రకటించారు.
ఇమేజింగ్ సాంకేతికతలో ఆయన చేసిన విప్లవాత్మక పరిశోధనలను గుర్తిస్తూ అవార్డును ప్రదానం చేశారు. చెన్నైలో పుట్టి పెరిగిన వీరరాఘవన్ ప్రస్తుతం రైస్ యూనివర్సిటీకి చెందిన జార్జ్ ఆర్. బ్రౌన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్లో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్గా చేస్తున్నారు. ఈ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. రైస్ యూనివర్సిటీలోని కంప్యుటేషన్ ఇమేజింగ్ ల్యాబ్లో చాలా మంది విద్యార్థులు పోస్ట్డాక్టోరల్స్, రీసెర్చ్ సైంటిస్టులు గత దశాబ్ద కాలంగా చేసిన అద్భుతమైన, వినూత్న పరిశోధనలకు ఇది గుర్తింపు అని వీరరాఘవన్ అన్నారు.







