9/11 మృతులకు అమెరికన్ల నివాళి
ఓ పక్క ప్రకృతి విలయాలతో అల్లాడిపోతున్న అమెరికా 9/11 మృతులకు ఘన నివాళుర్పించింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్పై 16 ఏళ్ల క్రితం జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన ఆప్తులు, బంధువులకు అంజలి ఘటించేందుకు వేలాది మంది పౌరులు సోమవారం గ్రౌండ్ జీరోకు చేరుకున్నారు. ప్రపంచాన్నే గడగడలాడించిన 9/11 ఉగ్రదాడిని తలచుకుని మళ్లీ అలాంటి దారుణ ఘటన పునరావృతం కాకూడదని కోరుతూ పౌరులు ప్రార్థనలు చేశారు. కొవ్వొత్తులు వెలిగించి మృతులకు శ్రద్దాంజలి తెలిపారు. పేలుళ్ల జరిగిన ఈ ప్రాంతంలో నిశ్శబ్దవాతావరణ నెలకొంది. కుటుంబ సభ్యులను కోల్పోయినవారు మౌనంగా రోదించారు. పేలుళ్లలో కుప్పకూలిపోయిన జంట భవనాల వద్ద కొవ్వొత్తులు వెలిగించారు. పేలుళ్లలో చనిపోయిన వారిని గుర్తుచేసుకుంటూ, వారి పేర్లు రాసి ప్లకార్డులు పెట్టారు. మీరు మా మధ్య లేకపోయినా మీ జ్ఞాపకాల్లోనే జీవిస్తున్నాం అంటూ కుటుంబ సభ్యులు ఆవేదన చెందారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్పై జరిగిన విమాన దాడిలో సుమారు 3 వేల మంది మృతిచెందారు. 2001 సెప్టెంబర్ 11న ఈ ఘోరకలి చోటుచేసుకుంది. దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశ ప్రజలకు ఓ సందేశం ఇస్తూ ఉగ్రవాద మహమ్మారిపై పోరుకు సహకరించాలని పిలుపునిచ్చారు.













