అడవిశేష్ కు అరుదైన ఇంటర్నేషనల్ పురస్కారం
లో బడ్జెట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు తీసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఆపాదించుకుని థ్రిల్లర్ సినిమాలంటే ఇతనే తీయాలి అన్నట్టు అందరి చూపు తన వైపు తిప్పుకున్నాడు యంగ్ హీరో అడవి శేష్. మల్టీ టాలెంటెడ్ అంటే ఇతనే అనిపించాడు. నటన మాత్రమే కాకుండా దర్శకత్వం, రచనలో కూడా ఎవరికి తీసిపోను అని నిరూపించాడు. తన సినిమాలకు తనే కథా సహకారం అందించుకోవడంతో పాటు దర్శకత్వం కూడా చేసుకున్నాడు. శశి కిరణ్ టిక్కా తెరకెక్కిస్తున్న మేజర్ సినిమాతో బాలీవుడ్లో కూడా నిలదొక్కుకోవాలని తన కలల పరిధిని విస్తరించుకుంటున్నాడు.
ఈ సినిమా 2008లో జరిగిన 26/11 ముంబాయి దాడులలో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోంది. కేరీర్ మొదట్లో ఎన్నో ఒడిదుడుకులను, ఆ తర్వాత వరుస విజయాలతో ఎన్నో అవార్డులను చూసిన అడవి శేష్ ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. న్యూయార్క్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ, బ్రిటీష్ జర్నలిస్ట్ కిరణ్ రాయ్ చేసిన సర్వే ప్రకారం దక్షిణ ఆసియాలో ఆర్ట్స్, మీడియా, కల్చర్లలో 400 ప్రతిభావంతులైన వారి జాబితాలో ఒకడిగా నిలిచాడు శేష్. ఇందులో అతను ఏ.ఆర్.రెహమాన్, జాకీర్ హుస్సేన్ లాంటి వారి పక్కన చోటు సంపాదించుకున్నాడు. ఈ 400 మంది ఇంటర్వ్యూలను జూమ్ ద్వారా తీసుకున్నారు. ఇది శేష్తో పాటు తెలుగు సినిమా కూడా గర్వపడాల్సిన సందర్భం ఇది.













