ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి గుడ్ న్యూస్
ఫస్ట్ తారీఖున జీతాల జమ
ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాల చెల్లింపు విషయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి ఈ నెల మొదటి తేదీనే జీతాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ బుధవారం ఉద్యోగుల జీతాలను విడుదల చేసింది.
జీతాల చెల్లింపులో ఆలస్యం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించిన సీఎం రేవంత్రెడ్డి ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించారు. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, హానరేరియం ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బందికి కూడా ప్రతి నెలా జీతాలు ఆలస్యం లేకుండా అందించాలని ఇటీవలే అధికారులను ఆదేశించారు.
సీఎం ఆదేశాల అమలులో భాగంగా ఆర్థిక శాఖ ఇటీవల అన్ని శాఖలు, విభాగాలకు సర్క్యులర్ జారీ చేసింది. జీతాల బిల్లుల సమర్పణ, పరిశీలన, ఆడిట్, ఆథరైజేషన్లో జాప్యం రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ప్రతి నెల 25వ తేదీలోగా జీతాలు, రెమ్యునరేషన్ బిల్లులను ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్, అకౌంట్స్ విభాగాలకు సమర్పించాలని ఆదేశించింది. నెల చివరి పని దినానికల్లా పరిశీలన, ఆడిట్, ఆథరైజేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేసింది.
ఈ అదేశాల అమలు.. జీతాల చెల్లింపుల వివరాలపై ముఖ్యమంత్రి బుధవారం ఆర్ధిక శాఖ అధికారులను ఆరా తీశారు. ఈ నెల బిల్లులు అందిన అన్ని విభాగాల ఉద్యోగులకు బుధవారం జీతాలు జమ చేసినట్లు ఆర్ధిక శాఖ అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు.








