రెండున్నరేళ్ల పాలనపై సీఎం రేవంత్ సర్వే!?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు ముగుస్తున్న నేపథ్యంలో, రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చ నడుస్తోంది. ప్రజా పరిపాలనపై ప్రజల అసలు అభిప్రాయం ఏంటి? క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ప్రతిష్ట ఎలా ఉందనే అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. ఇంటెలిజెన్స్, థర్డ్ పార్టీ నివేదికలను పక్కన పెట్టి, కేవలం తన సొంత నమ్మకస్థులతో కూడిన ‘సీఎం టీమ్’ను రేవంత్ రెడ్డి రంగంలోకి దించడం ఇప్పుడు పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది.
ప్రభుత్వ వ్యతిరేకత రాకముందే అప్రమత్తమవ్వడం, లోపాలను సరిదిద్దుకుంటూ ఎన్నికల మూడ్ను ఇప్పటి నుంచే సెట్ చేయడమే లక్ష్యంగా సీఎం స్వయంగా ఈ సర్వే ప్రక్రియను మానిటరింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రత్యేక సర్వేను సీఎం టీమ్ తొలుత మంత్రుల నియోజకవర్గాల్లో ప్రారంభించనుంది. ఆ తర్వాతే మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు విపక్షాల చేతిలో ఉన్న నియోజకవర్గాల్లోనూ ఈ టీమ్స్ పర్యటించనున్నాయి. ప్రభుత్వ ఆరు గ్యారెంటీలు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్లాయి? స్థానిక ప్రజలకు, పార్టీ క్యాడర్కు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు? నియోజకవర్గాల్లో పార్టీ పట్టు ఎలా ఉంది? ఎమ్మెల్యేల గ్రాఫ్ ఎలా ఉంది? ఎక్కడెక్కడ అసంతృప్తి వ్యూహాలు నడుస్తున్నాయి? అనే విషయాలను సీఎం అత్యంత రహస్యంగా క్రోడీకరిస్తున్నారు.
ఈ సర్వే ద్వారా వచ్చే డేటాను కేవలం నివేదికలకే పరిమితం చేయకుండా, ఒక పక్కా యాక్షన్ ప్లాన్ను సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం చేస్తున్నారు. సర్వే విశ్లేషణ ఆధారంగా పార్టీ పరంగా, ప్రభుత్వ అభివృద్ధి పరంగా వెనుకబడిన జిల్లాలను ప్రత్యేకంగా ఫిల్టర్ చేయనున్నారు. ఆయా జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో పాటు, ఇన్-ఛార్జ్ మంత్రులను అలర్ట్ చేసి క్యాడర్లో నూతనోత్తేజం నింపేందుకు సీఎం కార్యాచరణ రూపొందిస్తున్నారు. మరోవైపు, ప్రజాక్షేత్రంలో పట్టు కోల్పోతున్న ప్రజాప్రతినిధులకు తమ పనితీరు మార్చుకోవాలని గట్టి హెచ్చరికలు జారీ చేసేందుకు కూడా వెనుకాడబోరని గాంధీ భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇప్పటికే ప్రభుత్వం పనితీరు, నెరవేరని హామీలపై సునీల్ కనుగోలు టీమ్ ఉమ్మడి పది జిల్లాల్లో సర్వే చేసి సీఎంకు కీలక రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నివేదికలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. కొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్, మరికొన్ని జిల్లాల్లో బీజేపీ కాంగ్రెస్కు గట్టి ఫైట్ ఇవ్వనున్నట్లు అంచనా వేశారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ కంటే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మెరుగ్గా ఉన్నాయని ఈ రిపోర్ట్ తేల్చినట్లు సమాచారం. దీంతో పార్టీ ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు ఎలా మళ్లించాలనే దానిపై ప్రభుత్వ పెద్దలు కసరత్తులు ప్రారంభించారు. బీజేపీ ఓటు బ్యాంకు బీఆర్ఎస్కు, బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ కాకుండా ఉంటేనే కాంగ్రెస్కు పూర్తి లాభం జరుగుతుందని సునీల్ టీం సూచించినట్లు సమాచారం. ఇకపై ప్రతి ఆరు నెలలకోసారి తమ టీమ్ సర్వే చేసి ప్రభుత్వానికి రిపోర్టు ఇస్తుందని సునీల్ టీమ్ హామీ ఇచ్చింది. అంతేకాకుండా, పార్టీ సోషల్ మీడియా టీమ్లను హ్యాండిల్ చేసేందుకు కూడా ఈ టీమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మిగతా రాష్ట్రాల్లో అధికార పార్టీలు ఎదుర్కొన్న చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే క్షేత్రస్థాయి వ్యూహాలకు పదును పెడుతున్నారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ మార్క్ పాలనను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, వచ్చే ఎన్నికల నాటికి తిరుగులేని శక్తిగా ఎదగడానికి సీఎం వేసిన ఈ ‘సర్వే వ్యూహం’ రాష్ట్ర రాజకీయాల్లో ఏ రకమైన మార్పులు తీసుకువస్తుందో చూడాలి.








