ముగ్గురు సీఎంల సందడి, వైరల్ గా మారిన ఫోటో..!
తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు ఎంతో కీలకమైన తుంగభద్ర ప్రాజెక్టు సరికొత్త రికార్డుకు సిద్ధమైంది. జూన్ 25న తుంగభద్ర డ్యామ్ నూతనంగా నిర్మించిన 33 క్రెస్ట్ గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి ముగ్గురు రాష్ట్రాల ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో, గేట్ల ప్రారంభోత్సవానికి ముందర హోసపేటలోని ఐఆర్బీ (IRB) అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి(Revanth Reddy) మరియు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్లు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
మూడు రాష్ట్రాల సరిహద్దులు దాటి జల భద్రతే లక్ష్యంగా ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకే ఫ్రేమ్లో కనిపించడం అంతటా ఆసక్తి రేపింది. ఐఆర్బీ గెస్ట్ హౌస్లో జరిగిన ఈ ఆత్మీయ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రితో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు కూడా పాల్గొన్నారు. ఈ మర్యాదపూర్వక సమావేశంలో తుంగభద్ర ప్రాజెక్టు ఆధునికీకరణ, మూడు రాష్ట్రాల అంతర్రాష్ట్ర జల వివాదాల సామరస్య పరిష్కారాలు, వరద నియంత్రణ మరియు సిల్ట్ తొలగింపు వంటి అంశాలపై నేతల మధ్య ప్రాథమికంగా చర్చలు సాగినట్లు తెలుస్తోంది.
గత 2024 ఆగస్టులో వచ్చిన భారీ వరద ప్రవాహానికి తుంగభద్ర జలాశయం 19వ గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నీటి వృధాను అరికట్టేందుకు తక్షణమే స్టాప్ లాగ్ గేట్ ఏర్పాటు చేసినప్పటికీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) సూచనల మేరకు డ్యామ్ పూర్తి భద్రత కోసం మొత్తం 33 గేట్లను మార్చాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.51 కోట్ల వ్యయంతో కేవలం 6 నెలల రికార్డు కాలంలో అత్యంత అత్యాధునిక సాంకేతికతతో 33 సరికొత్త క్రెస్ట్ గేట్ల ఏర్పాటును పూర్తి చేశాయి.
73 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ తుంగభద్ర ప్రాజెక్టు ద్వారా ఏపీలోని అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో దాదాపు 1.46 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ఇరు తెలుగు రాష్ట్రాల సాగు, తాగు నీటి అవసరాలను తీర్చే ఈ ప్రాజెక్టు కొత్త గేట్లతో సురక్షితంగా మారడంతో రాయలసీమ మరియు తెలంగాణ పరివాహక ప్రాంత రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ భేటీ ముగిసిన అనంతరం, నేతలందరూ కలిసి మునిరాబాద్ లోని డ్యామ్ వద్దకు చేరుకుని గేట్లను జాతికి అంకితం చేసేందుకు బయలుదేరారు.








