మా షరతులకు ఇరాన్ అంగీకరించింది .. ట్రంప్ క్లారిటీ..!
త్వరలోనే పశ్చిమాసియాలో మళ్లీ శాంతి నెలకొంటుందన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్ అణు కార్యక్రమంపై జరుగుతున్న చర్చలు ముగింపు దశకు చేరాయని తెలిపారు. అమెరికాకు అవసరమైన ప్రతి నిబంధనకు ఇరాన్ దాదాపు అంగీకరించిందని ఆయన వెల్లడించారు. అయితే, ఇరాన్ ప్రభుత్వం.. ఎట్టిపరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని సాధించకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
“మేము ఇరాన్తో చర్చలు జరుపుతున్నాము. మాకు కావలసిన ప్రతిదానికి వారు దాదాపు అంగీకరించారని నేను భావిస్తున్నాను. మా లక్ష్యం స్పష్టం.. ఇరాన్ను అణ్వాయుధ రహిత దేశంగా మార్చడం. వారిని అణ్వాయుధాలు కలిగి ఉండటానికి మేము ఎప్పటికీ అనుమతించబోము” అని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే, ఇరాన్లో తాము అధికార మార్పిడిని ఆశించడం లేదని, కేవలం అణ్వాయుధాలు నివారించడమే తమ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
తాను మళ్లీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికా జరిపిన సైనిక చర్యల వల్ల ఇరాన్ రక్షణ సామర్థ్యం పూర్తిగా దెబ్బతిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. “మేము వారిని సైనికంగా పూర్తిగా ఓడించాము. వారి వద్ద ఇప్పుడు కొన్ని క్షిపణులు మాత్రమే మిగిలి ఉన్నాయి, వాటిని కూడా మేము పూర్తిగా తుడిచిపెట్టగలము” అని ఆయన అన్నారు.
ఇటీవలి కాలంలో ఇరాన్ జరిపిన దాడులకు అమెరికా దీటుగా సమాధానం చెప్పిందని ట్రంప్ వివరించారు. “గత వారం ఒక నౌకపైకి వారు డ్రోన్ను పంపినందుకు మేము మూడు సార్లు అత్యంత కఠినమైన దాడులు చేశాము. అంతకుముందు వారం కూడా వరుసగా మూడు రాత్రులు వారిపై విరుచుకుపడ్డాం. వారు ఏ తప్పు చేసినా మా దాడులు తీవ్రంగా ఉన్నాయి” అని ట్రంప్ వెల్లడించారు.
ఇరాన్పై ఆర్థిక, సైనిక ఒత్తిడిని పెంచడానికి అమెరికా నౌకాదళం ఒక అభేద్యమైన ‘ఉక్కు గోడ’ లాంటి దిగ్బంధనాన్ని విధించిందని ట్రంప్ చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అమెరికా నావికాదళం కారణంగా ఒక్క నౌక కూడా ఇరాన్కు చేరుకోలేకపోయిందని, దీనివల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని, అక్కడ 300 శాతం ద్రవ్యోల్బణం నెలకొందని ఆయన పేర్కొన్నారు.
అలాగే వ్యూహాత్మక హర్మూజ్ జలసంధిలో అమెరికా నౌకాదళం రహస్యంగా అంతర్జాతీయ నౌకలకు రక్షణ కల్పిస్తూ సురక్షితంగా బయటకు తీసుకువచ్చిందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగకుండా అడ్డుకోగలిగామని ఆయన డిఫెండ్ చేసుకున్నారు.
ఒప్పందం కుదిరితే ఆహార సరఫరా
ఒకవేళ చర్చలు సఫలమై ఇరాన్తో పూర్తిస్థాయి ఒప్పందం కుదిరితే, అమెరికా రైతుల నుండి ఇరాన్కు వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ ప్రకటించారు. “ఇరాన్కు ప్రస్తుతం ఆహారం అవసరం ఉంది. వారికి కావలసిన మొక్కజొన్న, గోధుమలు, సోయాబీన్స్ వంటి నిత్యావసరాలను కేవలం మన అమెరికన్ రైతుల నుండే ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటాం” అని ట్రంప్ తెలిపారు.








